గోరంట్ల రాజకీయం ముగిసినట్లేనా ?

2019 ఎన్నికల సమయంలో గోరంట్ల మాధవ్ అంటే పెద్ద సంచలనం. అంతకుముందు జిల్లాలోని తాడిపత్రిలో ఒక ఆశ్రమం గొడవల్లో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టి మీసం మెలేసి తొడకొట్టారు. జేసీ బ్రదర్స్ అంటే వణికిపోయే అధికారులను జనాలు చూశారే కానీ వాళ్ళకే చాలెంజ్ విసిరి మీసం మెలేసి తొడలు కొట్టిన అధికారిని అందులోను పోలీసు అధికారిని జనాలు ఎప్పుడూ చూసిందిలేదు. దాంతో మీడియా, సోషల్ మీడియాతో పాటు జనాల్లో మాధవ్ అంటే హీరో ఇమేజి వచ్చేసింది.

అప్పుడే జగన్మోహన్ రెడ్డి దాన్ని క్యాచ్ చేసి మాధవ్ కు హిందూపురం ఎంపీగా టికెట్ ఇచ్చారు. ఇంకేముంది వైసీపీ గాలికి మాధవ్ ఇమేజి తోడై మంచి మెజారిటితో గెలిచారు. అంటే మాధవ్ చాలంజ్ విసరటం, ఉద్యోగానికి రాజీనామా చేయడం, ఎంపీగా పోటీ చేయడం, గెలవటం అంతా సంచలనమే. అలాంటిది నాలుగేళ్ళు తిరిగేసరికి సంచలనం కాస్త కలలాగ కరిగిపోయింది.  ఇపుడు మాధవ్ గురించి పెద్దగా జనాలు మాట్లాడుకోవటంలేదు. ఎంపీ కూడా జనాల్లో ఎక్కడా కనబడటం లేదు.

కారణం ఏమిటంటే ఎంపీగా గెలిచిన దగ్గర నుండి అనేక వివాదాల్లో కూరుకుపోవటమే. వివాదాలు సరిపోవన్నట్లుగా ఒక మహిళతో న్యూడ్ కాల్ లో మాధవ్ మాట్లాడారనే వీడియో చాలా వైరల్ అయ్యింది. అది నిజమో కాదో ఎవరికీ తెలీదు. వీడియో కాల్ ఫేక్ అని మాధవ్ అంటున్నారు. వీడియోలో కనిపించింది తాను కాదని సదరు మహిళ కూడా చెప్పింది. కదిరి పోలీసుస్టేషన్ లో టీడీపీ నేతలపై ఫిర్యాదు కూడా చేసింది.  నిజమైనా అబద్ధమైనా ఆ వీడియో  ఎంపీని బాగా డ్యామేజి చేసిందన్నది నిజం.

దాంతో రేపటి ఎన్నికల్లో టికెట్ ఇస్తే గెలుస్తారా అనే సందేహం పార్టీలో  పెరిగిపోతోంది. అందుకనే ఎంపీగా పోటీచేయరు కర్నూలు జిల్లాలో ఎంఎల్ఏగా పోటీచేయబోతున్నారనే ప్రచారం జరిగింది. కొంతకాలంగా ఆ ప్రచారం కూడా ఆగిపోయింది. మొత్తం మీద ఎంపీ మాధవ్ రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడిందన్నది వాస్తవం.  రాజకీయాల్లో అలా ఒకసారి మెరిసి మాయమైపోతారమో చూడాలి.