ఎన్టీఆర్ ను చంపిన వారితో నాణెం విడుదలా?:లక్ష్మీ పార్వతి

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే, ఎన్టీఆర్ భార్య హోదాలో తనకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని రాష్ట్రపతి ముర్ముకు వైసీపీ నేత లక్ష్మీపార్వతి లేఖ కూడా రాశారు. అయినా సరే, ఈ కార్యక్రమానికి ఆమెకు ఆహ్వానం అందలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ భార్యనైన తనను ఈ కార్యక్రమానికి పిలవకపోవడం అన్యాయమని, ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన వాళ్ళు ఆయన వారసులుగా చలామణి అవుతున్నారని లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పేరుతో 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేయడం సంతోషంగా ఉందని, అదే సమయంలో తనను పిలవకపోవడం బాధగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తే ఎన్టీఆర్ భార్యగా తనను పిలవకపోవడం తప్పు అని అన్నారు. ఎన్టీఆర్ భార్యగా ఆ నాణెం అందుకునే అర్హత తనకు ఉందని, వాళ్లకు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇకపై తన పోరాటం పురందేశ్వరిపైనే అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ కొడుకులు అమాయకులని, కూతుళ్లు భువనేశ్వరి, పురందేశ్వరి దుర్మార్గులని సంచలన వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి తిరిగిన ప్రతి నియోజకవర్గంలో తాను తిరిగి ఒక్క సీటు కూడా రాకుండా ప్రచారం చేస్తానని సవాల్ విసిరారు. వారి గురించి ఎన్టీఆర్ ఏమన్నారో ప్రజలకు వివరిస్తానని అన్నారు. ఎన్టీఆర్ కు బయట చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, అంతర్గతంగా పురందేశ్వరి పొడిచారని ఆరోపించారు. రాజకీయాల్లోకి రావద్దు అని ఆమెతో ఎన్టీఆర్ అన్నందుకే ఆయ పై పురందేశ్వరి కుట్ర చేసిందని సంచలన ఆరోపణలు చేశారు.

తండ్రిపై కోపంతో ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లిందని ఆరోపించారు. ఎన్టీఆర్ భార్యనని తాను మెడలో బోర్డు పెట్టుకుని తిరగాలా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ తో పెళ్లి అయినట్టు ఫోటోలు, వార్తా కథనాలు, సాక్ష్యాలు ఉన్నాయని, ఆయన ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పారని గుర్తు చేసుకున్నారు. కానీ, తనపై మాత్రం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ కుటుంబంపై అభిమానంతో ఇన్నాళ్లు నోరు మెదపలేదని, ఇకపై వారిని వదిలిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు.

చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటికి లాగుతానని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల తర్వాత వీళ్ళు రాజకీయాల్లో లేకుండా చేస్తానని, తనకంటే ఎక్కువ అవమానానికి గురయ్యాలా పురందేశ్వరిని చేస్తానని శపథం చేశారు. ఎన్టీఆర్ కి భారత రత్న రాకుండా చేశారని ఆరోపించారు. తన లేఖలకు సమాధానం రాలేదని, ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లను కలుస్తానని అన్నారు.