ఓట్ల పంచాయతీ ని బీజేపీ ఏం చేస్తుందో ?

ఏపీలో దొంగ ఓట్ల పంచాయతీ తొందరలో ఢిల్లీకి చేరుకుంటోంది. ఈనెల 28వ తేదీ అంటే సోమవారం ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు కూడా కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ ను కలవబోతున్నాయి. రెండుపార్టీలు ఒకదానిపై మరొకటి ఫిర్యాదులు చేసుకునేందుకు రెడీ అయ్యాయి. తమకు అనుకూలంగా చేర్పించుకుంటు, తమకు ఓట్లు పడవని అనుమానం వచ్చిన ఓట్లను వైసీపీ నేతలు ఓటర్ల జాబితాలో నుంచి తీసేస్తున్నట్లు చంద్రబాబునాయుడు పదేపదే ఆరోపిస్తున్నారు.

ఇదే విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రస్తావిస్తూ టీడీపీ గతంలో చేర్పించిన 60 లక్షల దొంగ ఓట్లను ఇపుడు ఏరేస్తున్నట్లు ఎదురుదాడి మొదలుపెట్టారు. మొత్తానికి రెండు పార్టీల్లోను దొంగ ఓట్ల ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలా ఎక్కువైపోయాయి. నిజానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దొంగ ఓట్లను చేర్పిస్తుందనటంలో సందేహం లేదు. అధికారంలో ఉన్నపుడు ఒకలాగ ప్రతిపక్షంలోకి వస్తే మరోలాగ వ్యవహరిస్తున్నాయి కాబట్టే దొంగోట్ల గోల బాగా పెరిగిపోతోంది.

ఇపుడు విషయం ఏమిటంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ కు వైసీపీ, టీడీపీ ఫిర్యాదులు చేసుకున్నంత మాత్రాన ఏమీ అయిపోదు. ఓట్ల పంచాయతీలో బీజేపీ పాత్ర ఏమిటి అనేది చాలా కీలకమైనది. ఇపుడు వైసీపీ, టీడీపీలు చేసుకుంటున్న ఆరోపణల్లో ఏదో ఒకటే నిజం. లేదా రెండూ అబద్ధాలే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. పార్టీలు చేసుకుంటున్న ఆరోపణల్లో నిజం, అబద్ధం తేలాలంటే ఎన్నికల కమిషన్ పాత్ర చాలా కీలకం.

అయితే కమిషన్ దానంత అది తన పాత్రను నిర్వహిస్తుందని ఎవరు అనుకోవడం లేదు. దానికి తెరవెనుక నుండి వచ్చే ఆదేశాల ప్రకారమే వ్యవహరిస్తుందనటంలో సందేహం లేదు. రెండు పార్టీల్లో దేనికి బీజేపీ పెద్దలు వెయిట్ ఇస్తున్నారనేది కొద్దిరోజుల్లో బయటపడుతుంది. దాని ప్రకారమే రాష్ట్ర రాజకీయాలు నడుస్తాయనటంలో సందేహంలేదు. వైసీపీకి వ్యతిరేకంగా కేంద్రం పెద్దలు నిర్ణయం తీసుకుంటే కమీషన్ దొంగఓట్ల ఏరివేతను చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అదే టీడీపీని లైటుగా తీసుకుంటే కమీషన్ దొంగఓట్ల ఆరోపణలను పెద్దగా పట్టించుకోదు. రెండింటికి మధ్యేమార్గంగా వెళ్ళే అవకాశం కూడా ఉంది. అప్పుడు రెండువైపుల ఆరోపణలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని కమీషన్ నాన్చుతుంది. కాబట్టి ఓట్ల పంచాయితీలో బీజేపీ స్టాండ్ ఏమిటో చూడాలి.