తుమ్మలకు వెల్ కమ్

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు వెల్ కమ్ చెబుతున్నారు. తుమ్మల పార్టీలోకి వస్తానంటే సంతోషంగా స్వాగతం చెబుతామని అంటున్నారు. ఇదే విషయమై మాజీ ఎంపీ రేణుకాచౌదరి మాట్లాడుతు తుమ్మల వస్తానంటే స్వాగతిస్తామన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా తుమ్మలకు బాగా సన్నిహితులనే చెప్పాలి. ఈమధ్యనే పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తుమ్మలతో సర్దుకుని పోతారు.

వీళ్ళందరి మీద పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా తమ్ములకు బాగా సన్నిహితుడనే చెప్పాలి. నిజానికి తుమ్మల తెలుగుదేశంపార్టీలో బ్రహ్మాండంగా వెలుగుతున్న రోజుల్లో రేవంత్ అసలు నతింగ్ అనే చెప్పాలి. మంత్రి హోదాలో ఉంటూనే తుమ్మల అప్పట్లో చంద్రబాబునాయుడుతో సమానమైన ప్రాధాన్యతతో ఉండేవారు. సరే రాజకీయాలన్నాక అటు ఇటు అవుతునే ఉంటాయి. కాలం ఎప్పుడూ ఒకలాగుండదు కదా. నిజానికి కేసీయార్, తుమ్మల ఇద్దరు టీడీపీలో ఉన్నపుడు తుమ్మలే బాగా పవర్ ఫుల్ గా ఉండేవారు.

అలాంటిది ఇపుడు అదే కేసీయార్ ఇదే తుమ్మలకు టికెట్ నిరాకరించారు. బండ్లు-ఓడలు అంటే ఇదేనేమో. కాబట్టి పాతకాలాన్ని పట్టించుకోకుండా తుమ్మల గనుక కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అంగీకరిస్తే పాలేరులో టికెట్ ఖాయమనే అంటున్నారు. గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని గ్రౌండ్ రిపోర్టు చెబుతున్నది. ఒకవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బాగా సన్నిహితులైన తర్వాత పాలేరులో టికెట్ దక్కించుకోవటం పెద్ద కష్టం కాకపోవచ్చు.

అయితే తుమ్మల పార్టీలో చేరిన తర్వాత తమకు ఎక్కడ పోటీ వస్తారో అనే జెలసీతో కొందరు సీనియర్లు వ్యతిరేకం చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. భవిష్యత్తు సంగతిని పక్కనపెట్టేసినా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లో చేరటానికి తుమ్మలకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీలేదు. బీఆర్ఎస్ లో ఉండి ఎలాంటి ఉయోగం ఉండదని తేలిపోయింది. ఇదే విషయాన్ని మద్దతుదారులు తుమ్మలకు పదేపదే చెబుతున్నారు. రేణుకా చౌదరి లాంటి వాళ్ళు కూడా స్వాగతం చెబుతున్నారు. చివరకు తుమ్మల ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.