అర్హులందరికీ సంక్షేమ పథకాలు: జగన్‌!

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు నేడు డబ్బులు విడుదల చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించాలనే ఉద్దేశంతో 2022 డిసెంబర్‌ నుంచి 2023 జులై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి.. కొన్ని కారణాలతో లబ్ధి పొందని 2,62,169 మంది అర్హులకు మొత్తం రూ.216.34 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి అకౌంట్‌లలో జమ చేశారు.

అలాగే కొత్తగా అర్హత పొందిన మరో 1,49,875 మందికి పింఛన్లు.. 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 2,00,312 మందికి రేషన్‌ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలను అందించనున్నారు. ప్రభుత్వం పథకాలకు అర్హులై ఉండి కూడా.. కొందరు లబ్ధి పొందలేకపోయారు. అయితే ఆయా పథకాలను అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్‌ అనంతరం.. మిగిలిపోయిన అర్హులకు కూడా ఆర్నెళ్లకు ఒకసారి ప్రభుత్వం ప్రయోజనాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా ప్రయోజనం పొందని వారికి.. మొత్తంతో కలిపి 2021 డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకు నాలుగు పర్యాయాల్లో రూ.1,647 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది.

జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 94,62,184 సర్టిఫికెట్లు జారీ చేయగా.. కొత్తగా అర్హులుగా గుర్తించిన మరో 12,405 మందికి నేడు లబ్ధి చేకూరుస్తున్నారు. జగనన్నకు చెబుదాం ద్వారా అందిన దరఖాస్తుల్లో అర్హులైన 1,630 మందికి కూడా ప్రయోజనం కలగనుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాల ద్వారా లంచాలు, వివక్షకు తావు లేకుండా డీబీటీ రూపంలో నేరుగా రూ.2.33 లక్షల కోట్లను అకౌంట్‌లలో సీఎం జగన్‌ జమ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పూర్తి పారదర్శకంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనాన్ని చేకూరుస్తోంది జగన్ సర్కార్. సోషల్‌ ఆడిట్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హులందరికీ నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. ఈ క్రమంలో మిగిలిపోయిన లబ్ధిదారులకు కూడా న్యాయం చేస్తోంది.

కొందరు అర్హులై ఉన్నా దరఖాస్తు చేసుకోలేకపోవడమో, అర్హత నిర్ధారణలో జరిగిన పొరపాట్లతో ఇబ్బుందులు ఎదురవుతున్నాయి. అలాగే కొందరు నిర్ణీత సమయంలోగా దరఖాస్తు చేసుకోకపోవడం, బ్యాంకు అకౌంట్ విషయంలో ఇబ్బందిపడుతున్నారు. ఇలా ఏ కారణాలు అయినా సరే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అర్హులై ఉండి, ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం ఇస్తోంది ప్రభుత్వం. ఏడాదిలో రెండుసార్లు వారికి డబ్బుల్ని జమ చేస్తారు.