కామ్రేడ్‌.. మరి ఏపీలో పొత్తు ఎవరితో?

తెలంగాణాలో కామ్రేడ్‌లకు కేసీఆర్‌ షాకివ్వడంతో ఒక్కసారిగా వారంతా ఖంగుతిన్నారు. నాగార్జున సాగర్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో వారంతా కారు వెంట నడిచారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత వారిని పక్కన పెట్టడంతో వారి ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. పొత్తులో భాగంగా కనీసం నాలుగు సీట్లయినా తీసుకుని అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్న వారికి ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. దీంతో వామపక్ష పార్టీలు కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. అయితే వామపక్షాలు ఒంటరిగా పోటీచేస్తే ఓట్ల చీలిక తమకు లాభం చేకూరుస్తుందనేది కేసీఆర్‌ భావనగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో ఆంధ్రాల్లో కామ్రేడ్ల దారెటు.. అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇంతవరకు బహిరంగంగా ప్రకటించకపోయినా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక`ష్ణ, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ వైసీపీ ప్రభుత్వంపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఇదే పార్టీతో పొత్తు నడిపించిన జనసేన ఇప్పుడు దూరమైంది. ఆ తర్వాత బీజేపీతో పొత్తు కొనసాగిస్తోంది. తమకు దూరమైన జనసేన, అదేవిధంగా బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్న టీడీపీ.. ఈ రెండూ రాజకీయ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని నారాయణ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. వైసీపీని గద్దె దించేందుకు బీజేపీ, టీడీపీ కలిసి వస్తాయని జనసేన అధినేత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ వామపక్షాల మాటెత్తడం లేదు.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలను మిగిలిన పార్టీలు పక్కన పెడుతున్నాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ రెండు పార్టీలకు కొంత క్యాడర్‌ ఉందనేది వాస్తవం. ఏదో ఒక పార్టీ పంచన చేరి ఆ బలాన్ని చూపించి ఒకటో రెండో సీట్లు తెచ్చుకుని తమ ప్రాభవాన్ని నిలుపుకోవాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. కానీ రెండు రాష్ట్రాలలో పరిస్థితి గమనిస్తే ఎవరు కూడా ఆ పార్టీలను తమ పంచన చేరనిచ్చేటట్లు లేరు. తెలంగాణాలో ప్రస్తుతం కూడలిలో నిలుచున్న వామపక్షాలు.. ఆంధ్రాల్లో ఎటువైపు నడుస్తాయో చూడాలి.