తుమ్మలకు బుజ్జగింపులు

అసంతృప్త నేతలను బుజ్జగించే కార్యక్రమాన్ని కేసీయార్ మొదలుపెట్టారు. తుమ్మలను బుజ్జగించే పనిని నామా నాగేశ్వరరావుకు అప్పగించారు. మూడురోజుల క్రితం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 119 నియోజకవర్గాల్లో 115 మంది అభ్యర్ధులను మొదటిజాబితాగా ప్రకటించారు. వివిధ కారణాలతో నాలుగు నియోజకవర్గాలను మాత్రం పెండింగులో ఉంచారు. ఎప్పుడైతే కేసీయార్ మొదటిజాబితాను ప్రకటించారో అప్పటినుండే పార్టీలో అసంతృప్తులు మొదలైపోయాయి. ప్రకటించిన 115 నియోజకవర్గాల్లో కనీసం 30 నియోజకవర్గాల్లో కొద్దోగొప్పో అసంతృప్తులు బయటపడుతున్నాయి.

దాంతో వీళ్ళంతా అభ్యర్ధుల విజయాన్ని దెబ్బ కొట్టగలిగిన వాళ్ళే అని కేసీయార్ కు అనిపిచించేందేమో. అందుకనే ఎలాగైనా సరే దారికి తెచ్చుకోవాలనే ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టారు. ఖమ్మం జిల్లా పాలేరులో టికెట్ ఆశించి తుమ్మల నాగేశ్వరరావు భంగపడ్డారు. తుమ్మల మద్దతుదారులంతా మీటింగు పెట్టుకుని వెంటనే బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నది వీళ్ళ డిమాండు, సూచన. ఎందుకంటే ఎలాగూ బీఆర్ఎస్ లో టికెట్ రాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరితే తాము పాలేరులో టికెట్ ఇస్తామని హస్తంపార్టీ ముఖ్యనేతలు తుమ్మలకు కబురుపంపారు. అప్పట్లో ఇదే విషయమై తుమ్మల తన మద్దతుదారులతో సమావేశమై అభిప్రాయాలు కూడా సేకరించారు. రెండుసార్లు మీటింగులు పెట్టుకున్న తర్వాత మూడో మీటింగ్ జరగబోయే ముందు స్వయంగా కేసీయార్ ఫోన్ చేసి తుమ్మలతో మాట్లాడారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో, తుమ్మలకు కేసీయార్ ఏమి హామీఇచ్చారో తెలీదు.

తర్వాత కాంగ్రెస్ లో చేరే విషయమై తుమ్మల సమావేశాలు నిర్వహించలేదు. అలాంటిది చివరకు తుమ్మలకు మొండిచెయ్యిచూపించారు. దాంతో ఇపుడు ఇటు కాంగ్రెస్ నేతల నుండి అటు మద్దతుదారుల నుండి తుమ్మలపై ఒత్తిడి పెరిగిపోతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఖమ్మం ఎంపీ నామానాగేశ్వరరావు బుజ్జగింపులు మొదలుపెట్టారు. తుమ్మలతో నామా దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. నిజానికి వీళ్ళిద్దరికి కూడా పడదు. టీడీపీలో ఉన్నపుడు ఇద్దరి మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగుండేది. అలాంటి నామాను తుమ్మల దగ్గరకు నామా బుజ్జగింపులకు పంపారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.