టెక్నాలజీ తెలిసిన వారే దొంగ ఓట్లు కనిపెట్టండి మరి!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , టీడీపీ నేత నారా లోకేష్‌ పై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోల్లో రాళ్లు వేసిన వారేవరో తేల్చేందుకు తమ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. వైసీపీ వాళ్లే కనుక రాళ్లు వేసినట్లు రుజువు అయితే కనుక ఈ క్షణాన రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. టీడీపీ వారి దగ్గర సరుకు అయిపోయింది కాబట్టే ఇలాంటి పిచ్చి రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. నారా లోకేష్‌ హింసను ప్రోత్సహిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా కూడా వచ్చే నష్టం ఏమి లేదని ఆయన తేల్చి చెప్పారు. వచ్చేఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని తరిమికొడతారో..మిమ్మల్ని తరిమి కొడతారో చూద్దామన్నారు. టెక్నాలజీ మొత్తం నాకే తెలుసు అని కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు మరి దొంగ ఓట్లను గుర్తించడంలో కూడా టెక్నాలజీ సాయపడుతుందని తెలియదా అని ప్రశ్నించారు.

సెల్‌ఫోన్‌ కనిపెట్టాను అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబుకి టెక్నాలజీ ఉపయోగించి దొంగ ఓట్లను గుర్తించమన్నారు.ఉరవ కొండలో దొంగ ఓట్ల నమోదు జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయం లో చంద్రబాబు ఎన్ని రాజకీయాలు చేసినా సరే మేము ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆధార్, మోభైల్ నెంబర్ తో ఓటు సీడింగ్ జరుగుతోందన్నారు. ఎక్కడ కూడా అక్రమంగా ఓట్ల తొలగింపు అనేది లేదని స్పష్టం చేశారు.