28న ఢిల్లీకి వెళుతున్నారా ?

వైఎస్సార్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఈనెల 28వ తేదీన ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కబురుపంపింది. 28 న ఢిల్లీకి వచ్చి తమతో భేటీకి అందుబాటులో ఉండాలని సమాచారం అందించిందట. అలాగే తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్కను కూడా ఢిల్లీకి రమ్మని ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపిని విలీనం చేసే విషయమై గడచని రెండు నెలలుగా చర్చలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.

విలీనం చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నది కర్నాటక కాంగ్రెస్ అధ్యక్ష్డుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్. షర్మిల తరపున డీకేనే మొదట్లో కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరిపారు. మూడు, నాలుగుసార్లు డీకే-షర్మిల మధ్య చర్చలు జరిగిన తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి షర్మిల అంగీకరించారు. కాకపోతే విలీనం తర్వాత కాంగ్రెస్ లో తన పాత్ర ఏమిటి ? తనకు దక్కబోయే హోదా ఏమిటనే విషయమే సస్పెన్సుగా ఉంది.

షర్మిలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని, కర్నాటక నుండి రాజ్యసభకు ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీకి కానీ లేదా సికింద్రాబాద్ ఎంపీగా గాని పోటీచేయాలని షర్మిల అనుకుంటున్నట్లు సమాచారం. రెండింటిలో ఏది కరెక్టన్న విషయంపై ఎవరు క్లారిటి ఇవ్వటంలేదు. మొత్తానికి షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యే ముహూర్తం దగ్గరపడిందని మాత్రం అర్ధమవుతోంది.

షర్మిల పార్టీని విలీనం చేసుకునే విషయంలో రాహుల్ గాంధి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో రెండువైపుల నుండి అడుగులు స్పీడుగా పడుతున్నాయి. బహుశా 28వ తేదీన రాహుల్ గాంధి ఆఫీసులోనే షర్మిల చర్చలు జరిపే అవకాశముందని అంటున్నారు. ఒకసారి చర్చలు జరిగితే విలీనం ఇక లాంఛనమనే అనుకోవాలి. ఇందులో భాగంగానే షర్మిల 27వ తేదీనే తన మద్దతుదారులతో ఢిల్లీకి చేరుకోవటానికి ఏర్పాట్లు కూడా రెడీ చేసుకున్నారట. ఎన్నికలకు ముందు షర్మిల పార్టీ విలీనం అవటం వల్ల కాంగ్రెస్ కు లాభం కలుగుతుందని కొందరు సీనియర్లు అంచనా వేస్తున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.