గంప నెత్తిన ఎంపీ టోపీ

కేసీఆర్ కోసం సీటు త్యాగం చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎంపీ కాబోతున్నారా? ఆయన్ని ఎంపీగా గెలిపించుకోవడానికి కేసీఆర్ సిద్ధమయ్యారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. కామారెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ తన స్థానాన్ని వదులుకోక తప్పదు. అయితే ఇప్పటికే గంపను ఎంపీగా లోక్ సభకు పంపిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

కామారెడ్డిలో గంప గోవర్ధన్కు మంచి పట్టు ఉంది. వేర్వేరు పార్టీల తరపున ఆయన ఇక్కడి నుంచి విజయాలు సాధించారు. మొదట తెలుగు దేశం పార్టీ నుంచి 1994, 2004, 2009 ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్లో చేరిన ఆయన.. వరుసగా రెండు ఎన్నికల్లోనూ కామారెడ్డి నుంచి గెలిచారు. ప్రభుత్వ విప్ హోదాలోనూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన కచ్చితంగా విజయం సాధించేవారనే అభిప్రాయాలున్నాయి. అలాంటిది కేసీఆర్ కోసం సీటు త్యాగం చేశారు. కేసీఆర్ను కామారెడ్డి నుంచి పోటీ చేయాలని ఆహ్వానించినట్లు గతంలో గంప ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గంప గోవర్ధన్కు ప్రయోజనాలు కలిగించేందుకు కేసీఆర్ చూస్తున్నారని తెలిసింది. ఇప్పుడు మంత్రివర్గంలోకి గంపను తీసుకుని.. ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ స్థానానికి పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జహీరాబాద్ లేదా నిజామాబాద్ ఎంపీ స్థానంలో గంపను బరిలో దించాలని కేసీఆర్ చూస్తున్నట్లు తెలిసింది. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ పెద్దగా యాక్టివ్గా లేరు. పైగా ఆయన్ని అనర్హుడిగా తేల్చాలంటూ కోర్టు కేసు నడుస్తోంది. మరోవైపు నిజామాబాద్లో బీజేపీ నుంచి అర్వింద్ ఎంపీగా ఉన్నారు. దీంతో ఈ రెండు స్థానాల్లో ఓ చోటు నుంచి గంపను గెలిపించుకోవాలని కేసీఆర్ చూస్తున్నట్లు టాక్.