కవిత కోసమే కామారెడ్డి నుంచి కేసీఆర్

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే గజ్వేల్ ఎలాగో కేసీఆర్ అలవోకగా గెలుస్తారనే టాక్ ఉంది. అలాంటప్పుడు కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారనే విషయం అంతు పట్టడం లేదు. కేసీఆర్ నిర్ణయం వెనుక ఏ వ్యూహం దాగి ఉందో అర్థం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కామారెడ్డి నుంచి ఆయన పోటీ చేయడం వెనుక తన తనయ కవితకు ప్రయోజనం కల్పించాలనే ఆలోచన ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం కుమార్తె కవిత కోసమే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీకి సై అంటున్నారని చెప్పాలి. గత సార్వత్రిక ఎన్నికల్లో కవిత నిజామబాద్ ఎంపీగా పోటీ చేసి బీజేపీ నాయకుడు అర్వింద్ చేతిలో ఓడిపోయారు. స్వయంగా కేసీఆర్ కూతురు ఎన్నికల్లో ఓడిపోవడం అప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఆమెను ఎలాగోలా ఎమ్మెల్సీని చేశారు. కానీ వచ్చే ఎన్నికల్లో కవిత అసెంబ్లీలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ నేరుగా పోటీ చేస్తే.. గత ఓటమి తదితర కారణాలు ప్రభావం చూపే ఆస్కారముందని టాక్.

అందుకే ముందుగా కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేసి విజయం సాధిస్తారు. మరోవైపు గజ్వేల్లో ఎలాగో కేసీఆర్ గెలుస్తారు. అప్పుడు కామారెడ్డిలో రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో కవితను నిలబెట్టాలన్నది కేసీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది. అప్పటికే అక్కడ కేసీఆర్ గెలవడంతో పార్టీలో ఊపు ఉంటుంది. జనాలకూ బీఆర్ఎస్పై గురి ఉంటుంది. అదే జోరులో కవితను నిలబెట్టి గెలిపించాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నరు. మరి ఏం జరుగుతుందో తేలియాలంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగాల్సిందే.