నా చావుకు సానుభూతి ఉండకూడదు: పోసాని!

సినీ నటుడు పోసాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేశారు. రాజకీయాల్లో ఉంటూ కీలక వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు పోసాని. ఈ మధ్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తోన్న పోసాని.. తన కెరీర్ లో తాను ఎదుర్కొన్న ఆటు పోట్లను వెల్లడించారు.

తాజాగా పోసాని ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చావు గురించి మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.నేను చస్తే.. నా శవాన్ని కూడా ఇండస్ట్రీలోని వారికి చూపించొద్దు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తాను ఇప్పటికిప్పుడు చనిపోయినా ఫర్వాలేదని, తన కుటుంబాన్ని అంతా సెటిల్ చేశానని పోసాని చెప్పారు. తాను చనిపోయాక.. తన శవాన్ని కూడా ఇండస్ట్రీ వారికి చూపించకూడదని భార్యకు చెప్పినట్లు తెలిపారు.

నా కుటుంబాన్నిఅంతా సెటిల్ చేసి పెట్టానని, తన చావు గురించి నా భార్యని కూడా ముందుగానే ప్రిపేర్ చేసినట్లు చెప్పుకొచ్చారు. చూడమ్మా.. నేను ఎప్పుడు చచ్చిపోయినా ఏడవద్దు.. నీ పేరు మీద రూ.50 కోట్ల ఆస్తి ఉంది.. నేను చచ్చిపోయాక నీకు, పిల్లలకు ఎటుంటి ఇబ్బంది రాదన్నారు. నువ్వు ఏ పని చేయకపోయినా నెలకు రూ.8 లక్షలు రెంట్ వచ్చేలా ఏర్పాటు చేశానని పోసాని తెలిపారు.

ఏ ఒక్కరు నా చావుకు సానుభూతి పడడం, ఏడవడం చేసినా నాకు నచ్చదన్నారు. ముఖ్యంగా నువ్వు కూడా ఏడవద్దు.. అని నా భార్యను ప్రిపేర్ చేసి పెట్టాను అని చెప్పుకొచ్చారు పోసాని కృష్ణ మురళి. ఇంట్లో నలుగురు పని వాళ్లను పెట్టుకోమని చెప్పానని, ఎక్కడికి వెళ్లినా వాళ్లను కూడా తీసుకెళ్లమన్నానని, ఎందుకంటే తాను చనిపోయాననే బాధ ఉంటుంది కాబట్టి.. ఆ నలుగురు తన చుట్టూ ఉండేలా చూసుకోమన్నానని చెప్పానని తెలిపారు.

నేను చనిపోయాక.. నా శవాన్ని కూడా ఇండస్ట్రీలో ఎవరికీ చూపించొద్దని చెప్పినట్లు చెప్పారు. ప్రస్తుతం పోసాని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.