మా జీపీఎస్‌ ను దేశమే కాపీ కొడుతుంది: జగన్!

ఏపీలోని ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. సీపీఎస్‌ కి బదులు తమ ప్రభుత్వం మెరుగైన విధానం తీసుకువస్తున్నట్లు ఆయన వివరించారు. సీపీఎస్‌ సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తున్నట్లు ఆయన వివరించారు. సోమవారం విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ఎన్జీవోల బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభలో జగన్‌ మాట్లాడుతూ..అతి తర్వలోనే ఉద్యోగుల కోసం గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ పై ఆర్డినెన్స్‌ తీసుకువస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వానికి భారం పడకుండా ఉద్యోగులకు నష్టం లేకుండా జీపీఎస్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో అమలు చేయబోయే జీపీఎస్ దేశమే కాపీ కొడుతుందన్నారు.

ప్రభుత్వ వ్యవస్థలు బాగుంటేనే ప్రజలు, ఉద్యోగులు బాగుంటారని అన్నారు.ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు కల్పించిన మేలును వివరిస్తూ చంద్రబాబు హయాంలో జరిగిన అన్యాయాలను ఎత్తిచూపారు. ఏ ప్రభుత్వంతో పోల్చినా మన ప్రభుత్వమే అంత కంటే మిన్నగా ఉన్నామనీ చెప్పారు.

నాడు – నేడు ద్వారా కార్పోరేట్ పాఠశాలల ధీటుగా కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు, రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా చేసి పరిపాలన ను విస్తరించామని చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారదులు ఉద్యోగులనీ, గత ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఏమీ పట్టించుకోలేదని ఎన్నికలకు ముందు మభ్యపెట్టే పనులు చేశారన్నారు.

గత ప్రభుత్వం పక్కన పడేసిన సమస్యలను పరిష్కరించామన్నారు. బాబు హయాంలో 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం జగన్. జన్మభూమి కమిటీ ల పేరుతో చంద్రబాబు అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్నడీఏ ఒకటి దసరా కానుకగా అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.