తెలంగాణలో ‘కరోనా’ లెక్క తేలిపోతుందిక..

తెలంగాణలో కరోనా లెక్కల్లో ఎంతటి అయోమయం కొనసాగుతోందో తెలిసిందే. ప్రభుత్వం రోజూ విడుదల చేసే కరోనా కేసులు, మరణాల లెక్కలపై విశ్వసనీయత అంతంతమాత్రమే అని జనం భావిస్తున్నారు. మీడియాకు వెల్లడిస్తున్న దానితో పోలిస్తే కేసులు, మరణాలు చాలా ఎక్కువ అనే సందేహాలు ముందు నుంచి ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. కనీసం ఈ మధ్య కరోనా పరీక్షలైనా పెంచారు అని సంతోషిస్తున్నారు జనం. అంతకుముందు పరీక్షలు కూడా చాలా తక్కువ సంఖ్యలో జరిగేవి. ఒక సామాన్యుడు వెళ్లి పరీక్ష చేయమంటే అంత తేలిగ్గా టెస్టు జరిగేది కాదు. కరోనా అని అనుమానం ఉన్నప్పటికీ.. పరీక్ష చేయించుకోవడంలో ఉన్న ఇబ్బంది వల్ల ఆగిపోయిన వాళ్లు తెలంగాణలో లక్షల్లోనే ఉంటారేమో.

కరోనా సోకినా పెద్దగా లక్షణాలు కనిపించకుండా.. దానంతటదే తగ్గిపోయి మామూలుగా ఉన్న వాళ్ల సంఖ్య పెద్దగానే ఉంటుందని భావిస్తున్నారు. మరి ఇలా కోలుకున్న వారి లెక్కలు తీయడం ఎలా? ఇందుకు ఉద్దేశించిందే యాంటీబాడీస్ టెస్టు. రక్తం తీసుకుని పరీక్ష చేస్తే ఒంట్లో యాంటీబాడీస్ ఉన్నది లేనిది తేలిపోతుంది.

శరీరంలోకి కరోనా ప్రవేశించిన వారం తర్వాత శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దానిపై పోరాడే క్రమంలో ఈ యాంటీబాడీస్ తయారవుతాయి. ఇవి ఉన్నాయి అంటే.. ఆ వ్యక్తులకు కరోనా సోకినట్లే అన్నమాట. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనాపై పూర్తి అంచనా కోసం ఈ పరీక్షలు కూడా చేస్తున్నారు. మహారాష్ట్రలో కొన్ని నెలల కిందటే ఈ పరీక్షలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ పరీక్షలకు సిద్ధమైంది. ముందుగా హైదరాబాద్ పరిధిలో 25 వేల యాంటీబాడీ టెస్టులు చేయబోతున్నారట. కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవాళ్లతో పాటు వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి ఈ పరీక్షలు చేస్తారట. ఆ తర్వాత సామాన్యులకూ పరీక్షలు నిర్వహిస్తారట. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఈ పరీక్షలు చేయబోతున్నారు. దీన్ని బట్టి మొత్తంగా రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో వ్యాపించిందన్నది అంచనా వేయబోతున్నారు.