ఏం బాగుంది పవన్‌..బాబు దోపిడీ, పెత్తందారి వ్యవస్థనా?: బొత్స!

పచ్చ కామెర్లు వచ్చిన వాళ్లకి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు ఈ సెలబ్రిటీ పవన్ కల్యాణ్‌ కు అలాగే కనిపిస్తుందని విమర్శలు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. అసలు రాష్ట్రంలో నివాసమే ఉండని వాళ్లకి ఇక్కడి బాధలు తెలుస్తాయా అంటూ విమర్శలు చేశారు. ఏంటి వైసీపీతో పోల్చితే తనకు టీడీపీ పాలన నచ్చిందని పవన్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

మరి టీడీపీ పాలన బాగుంటే ప్రజలు ఎందుకు వారిని ఓడించి ఇంటికి పంపారంటూ ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని రాష్ట్రానికి మూడు పక్కల తిరుగుతున్నారు కానీ..మామూలు రోజుల్లో ఎప్పుడైనా వచ్చారా అంటూ ఆయన నిలదీశారు. తెలుగు దేశం అధికారంలో ఉండగా జరిగిన దోపిడీ, పెత్తందారి తనాలు… రాష్ట్రామంతా కలియ తిరిగేస్తున్న ఈ సెలెబ్రిటీకి కనిపించడం లేదా? ఆయన ఎద్దేవా చేశారు.

రుషికొండలో జరుగుతోంది ప్రభుత్వ భవనాల నిర్మాణం… పైగా ఆ నిర్మాణాలు ప్రభుత్వ భూముల్లోనే జరుగుతున్నాయి… నీకెందుకు నొప్పి? అందుకే ప్రజలు నిన్ను ఆమోదించడంలేదు” అని బొత్స వ్యాఖ్యానించారు. వైసీపీను గద్దె దించాలని సెలెబ్రిటీ అంటున్నారని, ఎందుకు గద్దె దించాలని అంటున్నారో, దాని వెనుక ఉన్న ప్రణాళికలు ఏంటో కూడా ఆ సెలెబ్రిటీ చెబితే బాగుంటుందని బొత్స అన్నారు.

ఉగాది తర్వాత సెలెబ్రిటీ పరిస్థితి ముగుస్తుందని, ఈ ఆర్నెల్లు వినిపించే అరుపులు, కేకలు ఆ తర్వాత ఉండవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి జగన్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు మంత్రి బొత్స. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యే­క హోదా సాధనే తమ పార్టీ విధానమని చెప్పారు. అసలు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందే చంద్రబాబు అని దుయ్యబట్టారు.

హోదా కాదు ప్యాకేజీ చాలు అంటూ కేంద్ర పెద్దలతో స్వీట్లు పంచుకుని శాలువాల్ని కప్పించుకుంది చంద్రబాబే అని గుర్తు చేశారు.హైదరాబాద్‌లో నివసించే పవన్‌ ఆంధ్ర గురించి, అందులో ఒక కొండ గురించి అంతగా ఎందుకు బాధ పడుతున్నాడని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారని…. ఈ సెలబ్రిటీ పవన్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. ప్యాకేజీకి ఆశపడి పార్టీ పెట్టి అద్భుతాల్ని సృష్టిస్తానంటూ కలలు కంటే ఏం జరగదన్నా రు.

“సెల్‌ఫోన్ నేనే కనిపెట్టాను లాంటి డాబు మాటల్ని చెప్పడానికి చంద్రబాబుకి సిగ్గు కూడా లేదేమో? ఆ పవన్ కళ్యాణ్ ఒకరు.. చంద్రబాబు పాలన బాగుందని చెప్తున్నాడు. రైతుల ఆత్మహత్యలు, జన్మభూమి కమిటీ అక్రమాలు, పెత్తందారి వ్యవస్థ అతనికి బాగుందా…?” – మంత్రి బొత్స సత్యనారాయణ