ఏపీ రాజకీయాల్లోకి బండి సంజయ్‌!

తెలంగాణ బీజేపీ నాయకుడు,బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆగస్టు 21న బండి‌ సంజయ్ అమరావతికి వెళ్లనున్నారు. తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ బలపడిందని నమ్ముతున్న అధిష్టానం ఇక బండి సేవలను ఏపీ బీజేపీకి ఉపయోగించుకునేలా ప్లాన్ వేసింది. దీంట్లో భాగంగానే బండి‌ సంజయ్ సేవలను ఆంధ్రప్రదేశ్ లో మరింత వాడుకోవాలని నిర్ణయించింది బీజేపీ హైకమాండ్.

ఆంధ్రప్రదేశ్ కి వెళ్లనున్న బండి ఓటరు నమోదు ప్రక్రియను సమీక్షించనున్నారు. బండి సంజయ్ కు తెలంగాణ, ఏపీతో పాటు.. మహారాష్ట్ర, గోవా, ఒడిశా సహా.. ఐదు రాష్ట్రాల బాధ్యతల్ని బీజేపీ అధిష్టానం అప్పగించనున్నట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్ ఎంట్రీతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీకి బండి రాజకీయం తోడైతే మరింతగా బలపడుతుందని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఏపీలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గెలుపు కోసం స్థానిక పార్టీలే కాకుండా జాతీయ పార్టీలు కూడా అధికారం కోసం యత్నిస్తున్నాయి. దీంట్లో భాగంగా ఏపీ పాలిటిక్స్ లోకి తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.

కాగా..ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడగొట్టిన కాంగ్రెస్ కు ఏపీ ప్రజలు ఇచ్చిన షాకు నుంచి హస్తం పార్టీ 10 ఏళ్లనుంచి కోలుకోలేకపోతోంది. కోలుకోవటం కాదు కదా..కనీసం ఉనికి కూడా చాటుకోలేని దుస్థితి ఏర్పడింది. అలాగే రాష్ట్ర విభజనకు సహకరించిన బీజేపీపై కూడా ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అలా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఏపీకి ద్రోహం చేశాయనే ఏపీ ప్రజలు నమ్ముతున్నారు.

అయినా 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా టీడీపీని గెలిపించారు. అధికారం చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ నేతలకు తన కేబినెట్ లో చోటు కల్పించారు. ఈక్రమంలో కేంద్రంలో అధికారంలోకొచ్చిన బీజేపీ విభజన హామీల్లో భాగంగా ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయంలో మొండిచేయి చూపించింది. ఇక ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయింది అని పదే పదే చెప్పింది. దీంతో ఏపీ ప్రజలు బీజేపీ అంటే కూడా మండిపడుతున్నారు. ఏపీపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని..ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందనే భావన ఉంది.

ఇటువంటి పరిణామాలాలతో చంద్రబాబు ఎన్టీయేతో విభేదించి పొత్తును ఉపసంహరించుకుని బయటకొచ్చేశారు. ఆ తరువాత ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పటంతో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. దీంతో ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇటువంటి కీలక పరిణామాల మధ్య 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్డీయేతో చెలిమి కలుపుకుంది. ఎన్డీయే తీసుకునే ప్రతీ నిర్ణయంలోనే వైసీపీ మద్దతునిస్తోంది.

బీజేపీ ఎలాగైనా సీట్లు గెలుచుకోవాలని యోచిస్తోంది. జనసేనతో కలిసి వెళితే పవన్ కల్యాణ్ క్రేజ్ తో నిలబడాలని యోచిస్తోంది. మరోవైపు జనసేన కూడా గతం కంటే మెరుగైన పటిమతో ముందుకెళుతోంది. వారాహి యాత్రతో పవన్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో ఉన్నారు.