ప్రచారానికి ముహూర్తం పెట్టుకున్నారా ?

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కేసీయార్ ప్రచారం కోసం ముహూర్తం కూడా పెట్టేసుకున్నారని సమాచారం. ఈనెల 23వ తేదీన ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభం పెట్టుకున్నారు. దాని తర్వాత పెద్ద బహిరంగసభ నిర్వహించబోతున్నారు. ఆ బహిరంగసభనే రాబోయే ఎన్నికల ప్రచారానికి ముహూర్తంగా కేసీయార్ నిర్ణయించుకున్నారట. మొదటి ఎన్నికల ప్రచార సభలోనే కాంగ్రెస్, బీజేపీలపై కేసీయార్ విరుచుకుపడటం ఖాయమని సమాచారం. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధులను తూర్పారబడితేనే కదా పార్టీ జనాల్లో కాస్తన్నా హుషారొచ్చేది.

కేసీయార్ కు ముహూర్తాల మీద బాగా నమ్మకం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఏపని చేయాలన్నా మంచిరోజు, ముహూర్తం చూసుకునే మొదలుపెడతారు. అందుకని రెండురోజుల క్రితమే శ్రావణమాసం మొదలైంది. శ్రావణమాసం అంటేనే మంచిపనులకు మంచిరోజులు వచ్చినట్లే అని చాలామంది నమ్ముతారు. కేసీయార్ కూడా అదేపద్దతిలో కలెక్టరేట్ కు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట.

ఇదే సమయంలో అభ్యర్ధుల మొదటిజాబితా కూడా రెడీ అయిపోయిందట. మరి మొదటిజాబితాను బహిరంగసభలోనే ప్రకటిస్తారా లేకపోతే ఈలోగానే ప్రకటించేస్తారా అనే టెన్షన్ జనాల్లో పెరిగిపోతోంది. పైగా మొదటిజాబితా అంటు ఒక లిస్టు మీడియా, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దాంతో పేర్లు లేని సిట్టింగులతో పాటు నేతల్లో టెన్షన్ బాగా పెరిగిపోయింది. ఆ జాబితా నిజమే అని కానీ తప్పని కానీ చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. 23న మెడక్ కలెక్టరేట్ తర్వాత సూర్యాపేట కలెక్టరేట్ ను ప్రారంభించి బహిరంగసభ నిర్వహించబోతున్నారు. అంటే కేసీయార్ ఎన్నికల మూడ్ లోకి డైరెక్టుగా దిగబోతున్నారని అర్ధమవుతోంది.

ఎన్నికల సభల్లోనే అనేక పథకాలపైన కూడా కేసీయార్ మాట్లాడుతారు. కొత్త పథకాలను ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని అనుకుంటున్నారు. ఏదిచేసినా షెడ్యూల్ విడుదలయ్యేలోగానే చేయాలన్నది కేసీయార్ ఆలోచన. అందుకనే ఉద్యోగులను ఆకట్టుకునేందుకు పీఆర్సీ, గృహలక్ష్మి పథకాల ప్రకటన కూడా ఉంటుందని అనుకుంటున్నారు. దళితబంధు, బీసీ బంధు, మైనారిటీలకు లక్ష రూపాయల సాయం, డబుల్ బెడ్ రూం ఇళ్ళు, ఉద్యోగ నియామకాల్లాంటి అనేక అంశాలు బహిరంగసభల్లో ప్రస్తావించే అవకాశాలున్నాయి. మొత్తంమీద ప్రత్యర్ధులకన్నా కేసీయార్ చాలా జోరుమీదున్నారని అర్ధమవుతోంది.