చంద్రబాబుది సుత్తి..దిక్కుమాలిన విజన్‌: పేర్ని నాని!

టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు గుప్పించారు. గతంలో విజన్‌ 2020 అన్న వాడు ఇప్పుడు విజన్‌ 2047 అంటున్నారని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన పేర్ని నాని..చంద్రబాబుది అంతా సుత్తి విజన్‌, ఓ దిక్కుమాలిన విజన్‌ అన్నారు.

టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఇరవై ఏళ్ల క్రితం పెరిగిన ఛార్జీలను తగ్గించమని నిరసన చేపట్టిన వారిని తూటాలతో పిట్టలను కాల్చినట్లు కాల్చి ముగ్గుర్ని చంపేసిన వ్యక్తి ఛార్జీలు తగ్గిస్తాననడం విడ్డూరమన్నారు. ఇదేనా విజన్? అని ప్రశ్నించారు.

విద్యుత్ కు సంబంధించి చంద్రబాబు వద్ద ఎలాంటి విజన్ ఉందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు 2047 తో కాలజ్ఞానం చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. నాడు ఉచిత విద్యుత్ ఇస్తానని వైఎస్ చెబితే కరెంట్ తీగలపై బట్టలు ఆరేయడానికి మాత్రమే పనికి వస్తుందని విమర్శలు గుప్పించిన విషయం ప్రజలు మరిచిపోలేదన్నారు.

సొంత మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యాడని, నాటి నుండి 14 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశాడో చెప్పాలన్నారు.ఎన్టీఆర్ గొప్ప నాయకుడని చంద్రబాబు చెబుతుంటారని, మరి అలాంటి వ్యక్తిని ఎందుకు వెన్నుపోటు పొడిచాడు? ఎందుకు కూల్చారు? అని ప్రశ్నించారు.

ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానని అన్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచాక కనీసం నీ చిత్తూరు జిల్లాకు ఎన్ని చెంబుల నీళ్లు ఇచ్చావ్? కనీసం కుప్పం నియోజకవర్గానికైనా ఇచ్చావా? అని నిలదీశారు. చంద్రబాబు ఏ ప్రాజెక్ట్ ని కూడా పూర్తి చేయలేకపోయిందన్నారు. చిత్తూరుకే దిక్కులేదు..ఇక రాష్ట్రానికి ఏం చేస్తాడని విమర్శించారు.

కనీసం విద్యా వ్యవస్థని అయినా చంద్రబాబు పట్టించుకున్నాడా? సొంత ఊరు పుట్టిన ఊరు అయినటువంటి నారావారి పల్లిలో ప్రభుత్వ బడిని బాగు చేసిన విజన్ అయినా ఉందా? ఎన్ని హాస్టల్స్‌ను టీడీపీ అధినేత మూసివేశారు? కనీసం కొత్త స్కూల్ ఒక్కటైనా తెరిచారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

చంద్రబాబు ఇదే చేశాడని చెప్పుకోవడానికి ఏముందో చెప్పాలన్నారు. 108, 104, ఆరోగ్యశ్రీ.. ఇవన్నీ ఎవరివని నిలదీశారు. కాకిలాగా పది కాలాలు బతకడం ఎందుకు? డెబ్బై ఏళ్లు ఉండి ఏం లాభం? 2047 వరకు బతకాలా? ప్రజలకు మేలు చేసి వైఎస్‌లా బతికితే చాలదా? అన్నారు.

విజన్ 2047 డాక్యుమెంట్ అనేది 2024 ఎన్నికల కు ఓటర్లకు వేసిన ఓ ఎర అని అభిప్రాయపడ్డారు. పవన్ సొల్లు కబుర్లు మాని, 2014 నుంచి 19 వరకూ రాష్ట్రానికి ఆయన వల్ల ఏమి మేలు జరిగిందే చెప్పాలన్నారు. పవన్ ఓ రాజకీయ మోసగాడని అభివర్ణించారు.