టీడీపీలో నాయకులు లేరు.. జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్

వైసీపీ ప్రభుత్వంపై, జగన్ సర్కారుపై, పోలీసులపై, టీడీపీపై తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న జేసీ దివాకర్ రెడ్డిపై చిందులేసినందుకే గోరంట్ల మాధవ్‌కు ఎంపీ టికెట్‌ ఇచ్చారని షాకింగ్ కామెంట్లు చేశారు జేసీ. ఇక, టీడీపీలో కార్యకర్తలున్నారని, నాయకులు లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళా పోలీసును ఎస్ఈబీ పోలీస్ స్టేషన్లో అవమానిస్తే మాట్లాడే దిక్కే లేదా తెలుగుదేశానికి అని ప్రశ్నించారు. తానేమన్నా అంటే తనను పనికిమాలిన వాడు అని విమర్శిస్తారని షాకింగ్ కామెంట్లు చేశారు.

మహిళా పోలీసుకు అవమానం జరిగితే పోలీసు అసోసియేషన్ ఏం చేస్తోందని నిలదీశారు. సీఐ చనిపోతే పోలీసు అసోసియేషన్ రాదని..భయం అని మండిపడ్డారు .ఎక్కడకు పోయింది అసోసియేషన్..అని ప్రశ్నించారు. అదే, గతంలో…మా అన్న చిన్న మాట అనిందానికే…ఓ గోల చేసి ఒక సీఐ ఎంపీ అయ్యాడు.. అని గోరంట్ల మాధవ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇసుక రవాణాకు అనుమతివ్వాలని, లేకుంటే ఆపాలని జేసీ మండిపడ్డారు. ఈ విషయంపై అధికారులకు లేఖ రాస్తానని చెప్పారు.

ఇసుక రవాణాపై అధికారులు, పోలీసుల నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే తామే తోలుకుంటామని జగన్ సర్కారును జేసీ హెచ్చరించారు. ఇసుక రవాణాకు సంబంధించి పోలీసులకు కమిషన్లు అందుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. సీఐ..ఎస్సై…డీఎస్పీలకు ఏమన్నా భాగాలున్నాయా అని సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం నుంచి పెన్నానదిలో వంటా వార్పు కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. తాడిపత్రిలో పుట్టడం తన అదృష్టమన్నారు జేసీ.