వ్యూహం సినిమాకు టీడీపీనే ప్రచారం చేస్తోందా ?

తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమా గురించే మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనవసరంగా వర్మతో పెట్టుకున్నారు. ఎవరెన్ని మాట్లాడినా, తిట్టినా వర్మ పట్టించుకోరు. తనను తిట్టేట్లుగా, తనపై ఆరోపణలు, విమర్వలు చేసేట్లుగా ప్రత్యర్ధులను వర్మ ఇంకా ఇంకా రెచ్చగొడుతునే ఉంటారని అందరికీ తెలిసిందే. ఎందుకంటే కాంట్రవర్సీల్లో ఉండటమే వర్మకు కావాల్సింది. అలాంటి వర్మ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యూహం అనే సినిమాను తీస్తున్నారు.

తొందరలోనే షూటింగ్ పూర్తవ్వబోయే సినిమాలో జగన్ క్యారెక్టర్ పాజిటివ్ గా… చంద్రబాబు నాయుడు, లోకేష్ తో పాటు మరికొన్ని క్యారెక్టర్లను నెగిటివ్ గానే తీస్తారనటంలో సందేహంలేదు. రాబోయే ఎన్నికల్లో జగన్ కు పాజిటివ్ ఇమేజి ఇవ్వటమే వర్మ టార్గెట్. ఈ విషయం తెలిసి టీడీపీ నేతలు ఎందుకని వర్మను అనవసరంగా కెలుకుతున్నారో అర్థం కావటంలేదు. దేవినేని లాంటి వాళ్ళు వర్మను  పట్టించుకోకపోతే అసలు వ్యూహం అనే సినిమా గురించి పెద్దగా ప్రచారమే జరగదు.

అలాంటిది వర్మ తీయబోయే సినిమా గురించి తమ్ముళ్ళు పదేపదే మాట్లాడుతుండటంతో వ్యూహం సినిమాకు టీడీపీ నేతలే ప్రచారం చేస్తున్నారా అనే సందేహం పెరిగిపోతోంది. సినిమాలు చూసి పార్టీలకు లేదా నేతలకు జనాలు ఓట్లేసే రోజులు ఎప్పుడో పోయాయి.  సినిమాలు, మీడియాలు పోయి సోషల్ మీడియా రాజ్యం ఏలుతోంది. ఇలాంటి సినిమాలు ఎవరి గురించి ఎవరు ఎన్ని సినిమాలు తీసినా జనాలు పట్టించుకోరు.

ఈ విషయం గతంలోనే చాలా సందర్భాల్లో నిరూపణ అయ్యింది. అయినా తమ్ముళ్ళు వర్మ తీస్తున్న వ్యూహం సినిమాపై రచ్చ ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. టీడీపీ పట్టించుకోకపోతే వ్యూహం సినిమా రిలీజవుతుంది..పోయింది అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. అలాకాకుండా పదేపదే దానిపై చర్చలు చేస్తు వర్మను చాలెంజులు చేయటం వల్ల సినిమా అంటే తమ్ముళ్ళు భయపడుతున్నారా అనే అనుమానం జనాల్లో మొదలవుతుంది. అప్పుడు సినిమాలో వర్మ ఏమి చూపించాడు అనేందుకైనా కొంతమంది సినిమాను చూస్తారు. ఇదంతా తమ్ముళ్ళకి అవసరమా ?