వ‌రుస‌గా 10వ సారి.. మోడీ సాధించిన అరుదైన రికార్డు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఢిల్లీలోని చ‌రిత్రాత్మ‌క‌ ఎర్రకోట వేదికగా జ‌రిగిన‌ 77వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల్లో వ‌ర‌సుగా ఆయ‌న ప‌దో సారి జాతీయ ప‌తాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ త‌ర‌ఫున ఇద్ద‌రుప్ర‌ధానులు చేయ‌గా.. వీరిలో మోడీ ఒక్క‌రే ఇలా.. ప‌దోసారి జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించ‌డం రికార్డుగా ఆ పార్టీ నేత‌లు అభివ‌ర్ణించారు.

ఇక‌, ఎర్రకోటపై జ‌రిగిన‌ వేడుకలను ప్ర‌త్య‌క్షంగా తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన దాదాపు 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా ప్ర‌ధాని స్వ‌యంగా ఆహ్వానించారు. వీరిలో ఏపీ రాష్ట్రం నుంచి 10 మంది ఉండ‌డం విశేషం. ఇక‌, ఎన్నిక‌ల సంవ‌త్స‌రం కావ‌డంతో వీరి సంఖ్య‌ను మ‌రింత పెంచారు.  గత ఏడాదితో పోల్చితే… ఈ ఏడాది పెద్ద సంఖ్యలో అతిథులకు ఆహ్వానం అందింది. ‘జన భాగస్వామ్యం’ పేరిట ఈ కార్య‌క్ర‌మాన్ని తీర్చిదిద్ద‌డం గ‌మ‌నార్హం.

య‌థా ప్ర‌కారం..

ఇక‌, ఎర్ర‌కోట పై నుంచి ప్ర‌సంగించినా.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. య‌థా ప్రకారం.. కాంగ్రెస్ పార్టీపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో 2014 వ సంవ‌త్స‌రం వ‌ర‌కు జ‌రిగిన పాల‌న ఒక ఎత్త‌యితే.. త‌ర్వాత‌.. ఈ దేశం అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగింద‌న్నారు. విశ్వ మంతా ఒక్క‌టే అనే నినాదాన్ని భుజాన వేసుకుని.. ప్ర‌పంచానికి సైతం భార‌త్ ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. గ‌తంలో ఈ త‌ర‌హా ఆలోచ‌న పాల‌కుల‌కు రాలేద‌న్నారు.

ఇప్పుడు ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా.. భారతీయ పౌరుల‌కు ఎన‌లేని గుర్తింపు, ఆద‌ర‌ణ ల‌భిస్తున్నాయ ని, దీనికి 2014 త‌ర్వాత తీసుకున్న నిర్ణ‌యాలు వేసిన అడుగులే కార‌ణ‌మ‌ని మోడీ వివ‌రించారు. ముఖ్యం గా క‌రోనా త‌ర్వాత‌.. భార‌త సామ‌ర్థ్యం ఏంటో ప్ర‌పంచ దేశాల‌కు తెలిసింద‌న్నారు. న‌వీన ప్ర‌పంచంలో భార‌త దేశ స్థానాన్ని ఎవ‌రూ విస్మ‌రించ‌లేని స్థాయికి భార‌త దేశం చేరిపోయింద‌న్నారు. వ‌ల‌స చ‌ట్టాల‌ను సంపూర్ణంగా ప్ర‌క్షాళ‌న చేస్తున్నామ‌ని ఇటీవ‌ల ఐపీసీ, సీఆర్ పీసీ వంటి చ‌ట్టాల మార్పుల‌ను ఆయ‌న ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు.