ఇద్దరి గురి యువత మీదేనా ?

రాబోయే ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల తరపున యువతే ఎక్కువగా పోటీలోకి దిగే అవకాశాలు కనబడుతున్నాయి. టికెట్లలో 40 శాతం యువతకే కేటాయించబోతున్నట్లు చంద్రబాబునాయుడు చాలాకాలం క్రితమే ప్రకటించారు. చంద్రబాబు లెక్కప్రకారం 40 శాతం అంటే 70 నియోజకవర్గాలు. మరి ఇన్ని టికెట్లను యువతకు కేటాయించటం సాధ్యమేనా అన్నది చూడాలి. యువత అంటే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే సీనియర్ల వారసులు, పూర్తిగా కొత్త నేతలే యువత అని అనుకుంటున్నారు. సరే పద్ధతి ఏదైనా యువతకు ఎక్కువ టికెట్లివ్వటం మంచి పరిణామమే కదా.

ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి దృష్టికూడా యువత మీదే నిలిచిందని సమాచారం. రాబోయే ఎన్నికల్లో కనీసం 40 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంఎల్ఏలకు టికెట్లు దక్కే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతోంది. అందుకనే సిట్టింగుల స్థానంలో కొత్త అభ్యర్ధులను అందులోను యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇక్కడ కూడా వారసులేనా లేకపోతే పూర్తిగా కొత్త ముఖాలా అనే చర్చ మొదలైంది. అయితే వారసులకు అవకాశాలు తక్కువని సమాచారం.

ఎందుకంటే సిట్టింగులకు టికెట్లిచ్చినా లేదా వాళ్ళ వారసులకు టికెట్లిచ్చినా రిజల్టు ఒకటేలాగ ఉంటుందని జగన్ క ఫీడ్ బ్యాక్ వచ్చిందట. వివిధ కారణాలతో వారసులకు మీద జనాలకున్న కోపాన్ని చల్లార్చాలంటే పూర్తిగా కొత్తవాళ్ళని పోటీలోకి దింపితేనే గెలుపు అవకాశాలున్నాయని సర్వేల్లో తేలిందట. అందుకనే వారసులకు టికెట్లు ఇచ్చే విషయంలో జగన్ పెద్దగా సుముఖంగా లేరని సమాచారం.

ఎలాగూ కొత్తముఖాలు పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే బాగుంటందని కూడా జగన్ అనుకుంటున్నారట. ఎందుకంటే రాష్ట్రంలో యువత ఓట్లు ఎక్కువగానే ఉన్నాయట.  యువత ఓట్లను ఆకర్షించాలంటే పార్టీల తరపున టికెట్లను యువతకు కేటాయించటమే మార్గమని జగన్, చంద్రబాబు అనుకున్నట్లున్నారు. మరి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమిచేస్తారో తెలీటంలేదు. నిజానికి ఈ పార్టీ తరపున పోటీచేసేందుకు సీనియర్లు పెద్దగా లేరు. కాబట్టి కచ్చితంగా యువతకే పవన్ టికెట్లు కేటాయించి తీరాలి.