మోడీకి  ఛాన్సిచ్చి.. చేతులు కాల్చుకున్న కాంగ్రెస్‌..

ఆయ‌న మాట‌ల మాంత్రికుడు. ఏ విష‌యాన్న‌యినా.. త‌న‌కు అనుకూలంగా ప్ర‌త్య‌ర్థుల‌కు వ్య‌తిరేకంగా తిప్ప‌గ‌ల దిట్ట‌. అలాంటి వారి చేతికి ఆయుధం ఇస్తే!  ఏం జ‌రుగుతుంది?  ఇదిగో ఇప్పుడు పార్ల‌మెంటు నుంచి కాంగ్రెస్ స‌భ్యులు అత్యంత వేగంగా వాకౌట్ చేయ‌డ‌మే జ‌రుగుతుంది. అదే జ‌రిగింది. దీంతో ప్ర‌ధాని మోడీకి ఛాన్సిచ్చి.. చేతులు కాల్చుకున్నట్టుగా మారిపోయింది కాంగ్రెస్ ప‌రిస్థితి.

మోడీ స‌ర్కారుపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టిన విష‌యం తెలిసిందే. దీనిపై రెండు రోజుల పాటు.. లోక్‌స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది. ఇక‌, మూడో రోజైన గురువారం సాయంత్రం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌కు స‌మాధానం చెప్పారు. అయితే.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన  సుదీర్ఘ ఉప‌న్యాసంలో గ‌తం లోతుల్లోకి వెళ్లిపోయారు. అక్క‌డ నుంచి ప్రారంభించి.. వ‌ర్త‌మానంలోకి వ‌చ్చారు. అడుగ‌డుగునా.. కాంగ్రెస్‌ను, గాంధీల కుటుంబాన్ని చుర‌క్కులు-చెమ‌క్కుల‌తో విమ‌ర్శ‌ల కొయ్య‌పై వేలాడ దీశారు.

దాదాపు 2 గంట‌ల‌కు పైగానే సాగిన ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగం ఆసాంతం కూడా కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌ల‌తోనే ముందుకు సాగింది. అహకంకారంతో కాంగ్రెస్‌ కళ్లు మూసుకుపోయాయని దుయ్య‌బ‌ట్టారు. వాస్తవికతను జీర్ణించుకునే పరిస్థితుల్లో లేరని అన్నారు. 1991లో భారత్‌.. అప్పుల కోసం ప్రపంచం వైపు చూసిందని, 2014 తర్వాత స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా నిలదొక్కుకుందన్నారు.

‘‘ రిఫార్మ్‌, పెర్‌ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌ అనే పద్ధతిలో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాం. మా పనితీరు, నిబద్ధతతోనే దేశాన్ని మూడో ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టి తీరుతాం. డిజిటల్‌ ఇండియా గురించి మాట్లాడినప్పుడు, జన్‌ధన్‌ గురించి మాట్లాడినప్పుడు అవహేళన చేశారు.  విపక్షాలకు ఆత్మ విశ్వాసం ఉండదు. దేశీయులను నమ్మరు. మన వ్యవస్థలకన్నా, మన సైన్యం కన్నా పాకిస్థాన్‌ చెప్పే మాటలపైనే విపక్షాలకు విశ్వాసం ఎక్కువ. భారత్‌పై వచ్చే వ్యతిరేక ప్రచారానికే ప్రతిపక్షాలు ఎక్కువ విలువిస్తాయి. భారత్ సామర్థ్యం మీద.. భారత ప్రజల సామర్థ్యం మీద విపక్షాలకు విశ్వాసం లేదు” అని మోడీ నిప్పులు చెరిగారు. మొత్తానికి మోడీకి ఛాన్సిచ్చి.. కాంగ్రెస్ అడ్డంగా దొరికిపోయింద‌నే వాద‌న మాత్రం వినిపించింది.