మోడీ రెచ్చగొడుతున్నారా?

ప్రతిపక్షాలను నరేంద్రమోడీ బాగా రెచ్చగొడుతున్నారు. తనవైపు ఇన్ని వైఫల్యాలు పెట్టుకుని ఇంకా ప్రతిపక్షాలను రెచ్చగొడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ మాట్లాడుతూ సిక్సర్ కొట్టి అవిశ్వాస తీర్మానాన్ని గెలిపించాలని చెప్పారు. సంఖ్యాబలం లేకపోయినా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించటాన్ని మోడీ చాలా చులకనగా మాట్లాడారు. ఓడిపోతుందని తెలిసీ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించటాన్ని మోడీ హేళన చేశారు. ఢిల్లీ బిల్లుపై ఓటింగుతో సెమీ ఫైనల్లో గెలిచాం కాబట్టి అవిశ్వాస తీర్మానమనే ఫైనల్లో కూడా ప్రభుత్వం గెలవాలని పిలుపిచ్చారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారాలను హరించేసినందుకు కేంద్రప్రభుత్వం సిగ్గుపడాలి. రెండు వరుస ఎన్నికల్లో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయి చావు దెబ్బతిన్నది బీజేపీ. ఆ మంట మోడీలో బాగా పెరిగిపోయినట్లుంది. ఎన్నికల్లో కేజ్రీవాల్ ను ఓడించటం సాధ్యంకాదని అర్దమైపోయి ప్రభుత్వ అధికారాలన్నింటినీ కేంద్రప్రభుత్వం హరించేసింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఉత్సవవిగ్రహంగా తయారుచేసి అధికారాలన్నింటినీ లెఫ్ట్ నెంట్ జనరల్ (ఎల్జీ) చేతికి అందించింది.

దొద్దిదారిన ఢిల్లీ ప్రభుత్వం అధికారాలను లాగేసుకోవటాన్ని కూడా మోడీ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఢిల్లీ సర్వీసుల బిల్లును పార్లమెంటులో నెగ్గించుకోవటం సెమీఫైనల్సట. ఇక మణిపూర్ అల్లర్లపై ఇండియా కూటమి, ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంలో గెలవటం ఫైనల్సట. కాబట్టి ఫైనల్స్ లో కూడా గెలవాలని అదికూడా సిక్సర్ షాట్ తో గెలవాలని మోడీ చెప్పారు.

రెండున్నర నెలలుగా మణిపూర్లో అల్లర్లను నియంత్రించలేకపోవటం రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల ఫెయిల్యూర్లు స్పష్టంగా బయటపడింది. ఇందుకు రెండు ప్రభుత్వాలు సిగ్గుపడాల్సింది పోయి ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నాయి. అల్లర్లను అదుపుచేయటంలో విఫలమైన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ను తొలగించాల్సిందిపోయి అలాగే కంటిన్యు చేస్తున్నారు. పైగా అల్లర్లను కంట్రోల్ చేయటంలో బీరేన్ సింగ్ ఫెయిల్యూర్ లేదని వెనకేసుకొస్తోంది. అక్కడ జరిగిన అల్లర్లపై పార్లమెంటులో అవిశ్వాసం సందర్భంగా చర్చలు జరుగుతున్నాయి. దీన్ని లో ప్రొఫైల్ తో ఎదుర్కోవాల్సిన మోడీ ప్రతిపక్షాలను ఇంకా రెచ్చగొడుతున్నారు.