బొత్స కామెంట్స్ విన్నారా.. వైసీపీలో ఇవే హైలెట్!

వైసీపీ స‌ర్కారుపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంటర్‌గా వైసీపీకి చెందిన అనేక మంది నాయ‌కులు వ్యాఖ్య‌లు చేశారు. వీరిలో కాపు నాయ‌కులే ఎక్కువ‌గా ఉన్నారు. స‌రే.. ఎవ‌రు ఏ వ్యాఖ్య‌లు చేసినా.. తూర్పు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన‌ మంత్రి  బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌లు వైసీపీలోనే హైలెట్‌గా నిలిచాయి. ఆయ‌న చాలా న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. వాల్తేరు వీర‌య్య చిత్రం 200 రోజులు(కొన్ని ధియేట‌ర్ల‌లో) ఆడిన నేప‌థ్యంలో ఫంక్ష‌న్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా చిరు మాట్లాడుతూ.. ఏపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సినిమా ఇండ‌స్ట్రీని పిచ్చుక‌తో పోల్చారు. “పిచ్చుక మీద బ్ర‌హ్మాస్త్రం మాదిరిగా సినిమా ఇండ‌స్ట్రీపై ప‌డ‌తారేంటి!” అని అన్నారు. ఈ ఒక్క వ్యాఖ్య‌ను బేస్ చేసుకుని బొత్స సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “అయితే.. సినిమా పిచ్చుకేన‌ని ఒప్పుకొంటున్నార‌న్న మాట‌” అని అన్నారు. చిత్ర‌ప‌రిశ్ర‌మ పిచ్చుకేన‌న్న మాట‌.. అని చెప్పుకొచ్చారు. అంటే.. బొత్స ఉద్దేశం ప్ర‌కారం.. సినిమా ఇండ‌స్ట్రీ ప్ర‌భావం పెద్ద‌గా  లేద‌నే ధోర‌ణి క‌నిపించింది.

వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సినిమా ఇండ‌స్ట్రీ ప్ర‌భావం ఉంటుందని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ దూకుడు పెరుగుతుంద‌ని, ఇది వైసీపీకి మ‌రింత ఇబ్బంది అవుతుంద‌ని.. అన్ని వ‌ర్గాల్లోనూ చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో చిరు చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని బొత్స చేసిన కామెంట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. సినిమా అంటే ఏదో అనుకున్నాం. కానీ, అది పిచ్చుకే.. మా ప్ర‌భుత్వాన్ని క‌ద‌ప‌లేదు. అన్న విధంగా బొత్స వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని వైసీపీ నాయ‌కులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. ఎంతో మంది కౌంట‌ర్లు ఇచ్చినా.. బొత్స త‌ర‌హాలో ఎవ‌రూ కౌంట‌ర్ ఇవ్వ‌లేద‌ని కూడా చెబుతున్నారు.