రాహుల్‌కు రిలీఫ్‌.. లోక్‌స‌భ్య స‌భ్య‌త్వం పున‌రుద్ధ‌ర‌ణ‌

కాంగ్రెస్ అగ్ర‌నాయకుడు రాహుల్‌గాంధీకి భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌న లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని పున‌రుద్దరిస్తూ పార్లమెంటులోని లోక్‌స‌భ స‌చివాల‌యం తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. ఈమేరకు రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. కీల‌క‌మైన పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో రాహుల్‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తేయ‌డం.. కాంగ్రెస్ పార్టీకి కూడా బిగ్ రిలీఫ్ అనే చెప్పారు.

2018 క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల ప‌క్షాన రాహుల్ గాంధీ ప్ర‌చారం చేశారు. అయితే, ఈ స‌మ‌యంలో ఆయ‌న “మోడీ ఇంటి పేరు చిత్రంగా దొంగ‌లకే ఉంటుంది ఎందుకో!” అని వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై గుజ‌రాత్‌కు చెందిన బీజేపీ నాయ‌కుడు ఒక‌రు అక్క‌డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే.. అనంత‌ర కాలంలో దీనిపై పెద్ద‌గా దృష్టి పెట్ట‌ని పోలీసులు.. ఈ ఏడాది ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై రాహుల్ దూకుడు పెంచిన త‌ర్వాత‌.. కేసు విచార‌ణ‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేశారు.

ఈ క్ర‌మంలోనే సూర‌త్ కోర్టు ఆయ‌న‌కు రెండేళ్ల జైలు శిక్ష‌తోపాటు 25 వేల రూపాయ‌ల జ‌రిమానా కూడా విధించింది. అయితే ఆవెంట‌నే ఆయ‌న బెయిల్ పిటిష‌న్ పెట్టుకోవ‌డంతో దానిని అనుమ‌తించారు. ఇక‌, దీనిపై అల‌హాబాద్ హైకోర్టులో రివిజ‌న్ పిటిష‌న్ వేసినా ఫ‌లించ‌లేదు. ఇంత‌లో హుటాహుటిన పార్ల‌మెంటు లోక్‌స‌భ స్పీక‌ర్ రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష ప‌డిన నేప‌థ్యంలో ఆయ‌న‌ను అనర్హుడిగా ప్ర‌క‌టించారు. దీంతో పార్ల‌మెంటు స‌భ్య‌త్వం కోల్పోయారు.

గ‌త 2019 ఎన్నిక‌ల్లో రాహుల్ కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇటీవ‌ల సుప్రీం కోర్టులో ఈ కేసును విచారించిన ధ‌ర్మాస‌నం.. రాహుల్ శిక్ష‌పై స్టే విధించింది. దీంతో పార్ల‌మెంటు తాజాగా ఆయ‌న‌పై విధించిన స‌స్పెన్ష‌న్‌ను ఎత్తేసింది. ఇదిలావుంటే.. పార్ల‌మెంటులో మ‌ణిపూర్ వివాదం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో రాహుల్‌గాంధీ స‌భ్య‌త్వం పున‌రుద్ధ‌రించ‌డం కాంగ్రెస్‌కు అతి పెద్ద రిలీఫ్‌గానే భావించాలి.