కేంద్రం పై ఒత్తిడి .. జగన్ చేయాల్సింది చేస్తున్నారు

కేంద్రప్రభుత్వంతో ఉన్న సత్సబంధాల కారణంగా బాగా ఒత్తిడి తెచ్చి ప్రత్యేకహోదా, పెండింగ్ నిధులు, ప్రాజెక్టులను సాధించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసమని వ్యూహాత్మకంగా లోక్ సభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ఎంపీ మార్గాని భరత్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లును గనుక లోక్ సభ స్పీకర్ ఆమోదిస్తే బిల్లుపై చర్చ జరుగుతుంది. అప్పుడు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం. 2014లో విభజన హామీల అమలు చట్టం తదితరాలన్నీ చర్చకు వస్తాయి.

విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేకహోదా, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ లాంటి అనేక హామీలున్నాయి. అయితే వీటిల్లో ఏ ఒక్కటీ అమల్లోకి రాలేదు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్ అంశాలను నరేంద్రమోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసింది. జగన్ ప్రభుత్వం కేంద్రంపై కొంతమేర ఒత్తిడి తీసుకొచ్చి పెండింగులో ఉన్న రెవిన్యు లోటు రు. 10 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు రీఎంబర్స్ మెంటు నిధులు రు. 12 వేల కోట్లు సాధించింది.

అయితే సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రత్యేకహోదా, రైల్వేజోన్ ఇవ్వాల్సిందే అని ప్రభుత్వం అడుగుతున్నా కేంద్రం లెక్కచేయటంలేదు. హోదా, రైల్వేజోన్ సాధించగలిగితే జగన్ ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయినట్లే.

ఒకవైపేమో షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ప్రత్యేకహోదా అన్నది రాష్ట్రం మొత్తం, రైల్వేజోన్ అన్నది ఉత్తరాంధ్రకు సెంటిమెంటుగా తయారైంది. ఈ రెండింటికి అదనంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం అవ్వబోతోంది. దీన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచేట్లు లేదా కనీసం స్టీల్ అథారిటి ఆఫ్ ఇండియా (సెయిల్) పరిధిలోకి అయినా చేర్చమని రాష్ట్రప్రభుత్వం పదేపదే అడుగుతున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోవటంలేదు. 2024 ఎన్నికల్లో కూడా మళ్ళీ గెలవాలని పట్టుదలగా ఉన్న జగన్ విభజన హామీల్లో కీలకమైనవి అయినా సాధించాలని పట్టుదలగా ఉన్నారు. అయితే నరేంద్రమోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టగలరా ? సాధించగలరా ? అన్నదే అనుమానంగా ఉంది.