గ‌వ‌ర్న‌ర్ తీరుకు నిర‌స‌న‌గా తెలంగాణ ఆర్టీసీ బంద్

తెలంగాణ ప్ర‌గ‌తి ర‌థం.. ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీలు నిలిచిపోయాయి. ఈ రోజు ఉద‌యం 4 గంట‌ల‌కే ప్రారంభం కావాల్సిన ఎంజీబీఎస్ లోని సిటీ స‌ర్వీసులు స‌హా.. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బ‌స్సులు అంగుళం కూడా ముందుకు క‌ద‌ల‌లేదు. ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. డ్రైవ‌ర్లు, కండెక్ట‌ర్లు కూడా యూనిఫాం వేసుకుని.. బ‌స్సుల్లో కూర్చున్నారే త‌ప్ప వారు బ‌స్సుల‌ను మాత్రం న‌డిపించ‌లేదు. దీనికి కార‌ణం.. ఉరుములు లేని పిడుగులా.. కార్మికులు ఉద్య‌మానికి పిలుపునివ్వ‌డ‌మే.

తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేష‌న్‌(టీఎస్ ఆర్టీసీ)ని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌ని.. కేసీఆర్ స‌ర్కా రు నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. దీనిని బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టి.. ఆమోదించుకోవడం ద్వారా 50 వేల మంది పైచిలుకు ఉన్న ఆర్టీసీ కార్మికుల‌కు న్యాయం చేయాల‌నేది కేసీఆర్ స‌ర్కారు ఉద్దేశం. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వ‌ర్షాకాల అసెంబ్లీ స‌మావేశాల్లోనే ఈ బిల్లుకు మోక్షం క‌లిగించుకుని.. అమ‌లు చేయాల‌న్న‌ది వ్యూహం.

త‌ద్వారా ఎన్నిక‌ల్లోనూ అంతో ఇంతో లాభ‌ప‌డొచ్చ‌ని కేసీఆర్ అనుకున్నారు. అనుకున్న‌దే త‌డ‌వుగా.. ఆర్టీసిని.. స‌ర్కారులో విలీనం చేస్తున్న‌ట్టు ఇటీవ‌ల నిర్వ‌హించిన కేబినెట్ మీట్‌లో నిర్ణ‌యించారు. దీనికి సంబంధించిన బిల్లు రెడీ అయింది. అయితే.. తొలుత దీనిని గ‌వ‌ర్న‌ర్ ఆమోదించాల్సి ఉండ‌డంతో నిబంధ‌న‌ల మేర‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు పంపించింది. అయితే.. దీనిపై రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాల‌కు గంట‌కో మాట మార్చారు.

అస‌లు బిల్లు త‌మ చెంత‌కు రాలేద‌ని ఒక‌సారి.. వ‌చ్చినా ఇంకా చూడలేద‌ని ఇంకోసారి.. పేర్కొన్నారు. చివ‌ర‌కు శుక్ర‌వారం రాత్రి పొద్దుపోయాక‌.. బిల్లులో లోపాలు ఉన్నాయంటూ.. రాజ్‌భ‌వ‌న్ తెలిపింది. దీంతో స‌ర్కారు వైపు నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఇదిలావుంటే.. కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు.. గ‌వ‌ర్న‌ర్ తీరుకు నిర‌స‌న‌గా.. శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి ఉద్య‌మానికి సిద్ధం కావ‌డం ఆ వెంట‌నే బ‌స్సుల‌ను నిలిపివేయ‌డంతో తెలంగాణ‌లో ప్ర‌జార‌వాణా వ్య‌వ‌స్థ దాదాపు నిలిచిపోయింది.