ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ లో క్రిమినల్స్: తోపుదుర్తి

నీటిపారుదల ప్రాజెక్టుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రాయలసీమ పర్యటన విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో ప్రసంగించిన చంద్రబాబు…రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తోపుదుర్తి చేసిన అవినీతి అంతా కక్కిస్తానని, ఎక్కడ దాక్కున్నా వదిలేది లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు కర్ర తీసుకుని దాడికి వస్తే కర్రతోనే సమాధానం చెప్పాలని అనంతపురం టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కామెంట్స్ కు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

తనకు 2 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని చంద్రబాబు అంటున్నారని, తనకు 50 కోట్లు ఇస్తే ఆయన చెప్పిన 2 వేల కోట్ల ఆస్తులన్నీ రాసిచ్చేందుకు రెడీ అని సవాల్ విసిరారు. మిగిలిన 1950 కోట్లతో రాప్తాడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తారా అని చంద్రబాబుకు ఛాలెంజ్ చేశారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఈ సవాల్‌ స్వీకరించాలని డిమాండ్ చేశారు. పాల డైరీ, బోరు బావుల ద్వారా ప్రజా సేవ చేస్తున్నానని, బాబు బెదిరింపులకు భయపడబోనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచి నువ్వు ముఖ్యమంత్రి అయితే గుండు కొట్టించుకుంటానంటూ చంద్రబాబుకు మరో ఛాలెంజ్ చేశారు.

హెరిటేజ్ ద్వారా రైతులను మోసం చేసి 25 వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన చంద్రబాబు తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌లో ఫ్యాక్షన్ బాధితుల పిల్లలను చదివించి ఫ్యాక్షన్ చేయిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్‌ క్రిమినల్స్‌ను తయారు చేసే అడ్డా అని సంచలన ఆరోపణలు చేశారు. అక్కడి విద్యార్థులు కేసుల్లో ఉన్నారని ఆరోపించారు.

శిలాఫలకాలు వేయడం తప్ప ప్రాజెక్టులు పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేవని దుయ్యబట్టారు. అమరావతిని రియల్ ఎస్టేట్ దందాగా మార్చారని, తన బినామీలతో అమరావతిలో భూములు కొనిపించారని ఆరోపించారు. చంద్రబాబు రూ.40 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని, ఆయనో గజదొంగ అని విమర్శించారు.