వైసీపీకి వైఎస్ఆర్ ముద్దు..విజయమ్మ వద్దు?

సీఎం వైఎస్ జగన్ సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేరంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. బాబాయి వివేకా హత్య కేసులో వైఎస్ సునీత న్యాయపోరాటం చేస్తుంటే…జగన్ మాత్రం అవినాష్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రం దగ్గర చేతులు కట్టుకు నిలుచుంటున్నారని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక, సొంత చెల్లి షర్మిలను తెలంగాణకు పరిమితం చేసి, ఆమెతో పాటు తల్లి విజయమ్మను కూడా జగన్ పార్టీనుంచి సాగనంపారని ట్రోల్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి వైఎస్సార్ ఫోటో కావాలని, కానీ, ఆయన సతీమణి వైఎస్ విజయలక్ష్మికి మాత్రం పార్టీలో సభ్యత్వం లేదని దుయ్యబట్టారు.

ఇంతకంటే మోసం ఎక్కడా ఉండదని, వైసీపీ ఓ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలా తయారైందని విమర్శించారు. రాష్ట్ర సంపదను జగన్ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క చాన్స్ అంటూ అన్ని వర్గాల గొంతు కోసిన పార్టీ వైసీపీ అని మండిపడ్డారు.

వైసీపీ పుట్టుకే మోసపూరిత ఆలోచన అని, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. వైఎస్సార్‌ది ఏ పార్టీ? జగన్‌ది ఏ పార్టీ? అని కన్నా నిలదీశారు. వైఎస్ఆర్ సోదరుడు వివేకా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారన్న కారణంతో ఆయనను చంపించారని ఆరోపించారు. జగన్ సీఎం అయితే సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉంటుందని ముందు చెప్పింది తానేనని, ఇప్పుడు తాను చెప్పినట్లే జరుగుతోందని కన్నా అన్నారు.