పుంగనూరులో టీడీపీ ఉగ్రరూపం

Punganuru
Punganuru

చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటిస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అధినేత పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు, వైసీపీ నేతలు ప్రయత్నించడంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు.

దీంతో టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు కూడా వారి లాఠీలకు పని చెప్పాల్సివచ్చింది. అయినప్పటికీ ఆగకపోయేసరికి భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. అన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా టీడీపీ కార్యకర్తలు శాంతించకుండ పోలీసులను తరిమికొట్టారు.

దీంతో పోలీసులు పారిపోయారు. పుంగనూరు బైపాస్ రోడ్డులో ఉద్రిక్త వాతావరణంతో వాహనాలు ఆగిపోయాయి. మళ్లీ పుంగనూరు టౌన్ లోకి టీడీపీ కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకోవడానికి భారీగా పోలీసులు తరలివస్తున్నారు. టీడీపీ కార్యకర్తలపై మళ్లీ పోలీసులు రాళ్ల దాడి చేయగా, మళ్లీ పోలీసులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి చేశారు. పుంగనూరులో పోలీసుల వజ్రా వాహనం ధ్వంసమవ్వగా, మరొక పోలీసు వాహనానికి వైసీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు.

అంతకుముందు అంగళ్లులో చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రోడ్ షోపై వైసీపీ నేతలు, కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారు. టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లను చించేసిన వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలపైనా రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దేవేంద్ర అనే ఎంపీటీసీ సహా పలువురు నేతలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు లాఠీఛార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

దీనిపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని ఆరోపించారు. డీఎస్పీ తన యూనిఫామ్ తీసేయాలంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాంబులకే తాను భయపడలేదని.. రాళ్లకు భయపడతానా అని ప్రశ్నించారు. దమ్ముంటే రండి చూసుకుందాం.. పులివెందులకే వెళ్లానని, తానూ చిత్తూరు జిల్లాలోనే పుట్టానని చంద్రబాబు పేర్కొన్నారు.

పోలీసుల అండతోనే వైసీపీ నేతలు ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఎవరి జోలికి తాము వెళ్లమని.. మా జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. పుంగనూరుకు వెళ్తున్నానని.. అక్కడి పుడింగి సంగతి తేలుస్తానంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక్కడ రావణాసురుడిలాంటి ఎమ్మెల్యే వున్నాడని.. ఇలాంటి వాళ్లను భూస్థాపితం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలీసులు ఎవరికి ఊడిగం చేస్తున్నారని.. అంగళ్లు ఘటనపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.