ఆర్‌-5 జోన్‌.. హైకోర్టు తీర్పు: వైసీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా..!

రాజ‌ధాని అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇంటి ప‌ట్టా ఇవ్వ‌డ‌మే కాకుండా.. వారికి ఇల్లు క‌ట్టించి ఇవ్వాల‌నేది వైసీపీ స‌ర్కారు సంక‌ల్పం. అయితే.. దీనికి ప్ర‌స్తుతం బ్రేకులు ప‌డ్డాయి. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతం కొంద‌రిదే కాద‌ని.. అంద‌రిదీ అని వైసీపీ ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ రైతుల నుంచి సేక‌రించిన భూమిని మంగ‌ళ‌గ‌రి(గుంటూరు), విజ‌య‌వాడ ప్రాంతాల్లోని పేద‌ల‌కు పంపిణీ చేసింది.

అయితే.. ఈ విష‌యంపై క‌న్నెర్ర చేసిన రైతులు.. కోర్టుకు వెళ్లారు. తాము రాజ‌ధాని కోసం ఇచ్చిన భూము ల‌ను స‌ర్కారు పేద‌ల‌కు ఇవ్వ‌డాన్ని వారు త‌ప్పుబ‌ట్టారు. ఇక‌, సుప్రీం కోర్టు కూడా.. తుది తీర్పున‌కు లోబ డే ఇక్క‌డ ప‌ట్టాల పంపిణీ జ‌ర‌గాల‌ని పేర్కొంది. దీంతో స‌ర్కారు హ‌డావుడిగా ఇక్క‌డ భూములు పంపిణీ చేసింది. తుది తీర్పున‌కు లోబ‌డి ఉండాల‌న్న నిబంధ‌న‌తోనే ప‌ట్టాలు ఇచ్చింది.

ఇంత‌వ‌ర‌కు ఓకే. ఇక్క‌, ప‌ట్టాలు ఇచ్చాక ఇళ్లు క‌ట్టుకోకుండా ఎలా ఉంటారంటూ.. ప్ర‌జ‌ల ఇళ్ల నిర్మాణానికి కూడా ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనిపై మ‌రోసారి రైతులు హైకోర్టుకు వెళ్లారు. ఎలాంటి హక్కులు లేని భూమిలో ఇళ్లు ఎలా నిర్మిస్తారంటూ.. వారు వాద‌న‌లు లేవ‌నెత్తారు. దీనిపై తాజాగా హైకోర్టు స్టే ఆర్డ‌ర్ ఇచ్చింది. దీంతో ఇక్క‌డ ఇళ్లు పొందిన 50 వేల మందికి నిరాశే ఎదురైంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నా యి.

ఇక‌, ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఈ కేసు ఇప్ప‌ట్లో తేలేలా లేద‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు. అందుకే.. దీనిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే వ్యూహంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. తాడేప‌ల్లి వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. ఆర్ -5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాల‌పై విధించిన స్టేను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి.. ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌ని అనుకున్న త‌మ ప్ర‌భుత్వాన్ని ప్ర‌తిప‌క్షాలు ముందుకు సాగ‌నివ్వ‌డం లేద‌నే సెటింమెంటును మ‌రింత వేడెక్కించ‌నున్నారు. అయితే.. విప‌క్షాలు కూడా.. వైసీపీ వ్యూహాన్ని చిత్తు చేయాల‌ని భావిస్తున్నాయి. ఏదేమైనా.. ఇప్పుడు ఆర్‌-5 వ్య‌వ‌హారంలో వైసీపీకి +, – రెండూ క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.