ఈటలకు హగ్ ఇచ్చిన కేటీఆర్..ఏంటి మ్యాటర్?

బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్ సుదీర్ఘ కాలంపాటు బీఆర్ఎస్ లో కొనసాగిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలలో ఒకరైన ఈటల…కొన్ని పరిస్థితుల కారణంగా బీజేపీలో చేరారు. అటువంటి ఈటలపై మంత్రి కేటీఆర్ కు ప్రత్యేకమైన అభిమానం ఉందా? అన్న రీతిలో తాజాగా అసెంబ్లీలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. తాజాగా మొదలైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లిన కేటీఆర్..ఈటలను ఆప్యాయంగా పలకరించి.. ఆలింగనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. దాదాపు 10 నిమిషాల పాటు వారిద్దరూ మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు, మంత్రి కేటీఆర్‌‌ను ఆయన ఛాంబర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిసిన సందర్భంగానూ ఫన్నీ సంభాషణ జరిగింది. టీషర్ట్‌తో వచ్చిన జగ్గారెడ్డిని ‘పిల్లలతో కలిసి తిరిగితే ఎలా?’ అని కేటీఆర్ ఆటపట్టించారు. ‘టీషర్ట్ తో వస్తే పిల్లలవుతారా?’ అంటూ జగ్గారెడ్డి కూడా చమత్కరించారు. జగ్గారెడ్డితో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ దోస్తాన్ ఎక్కడ కుదిరింది అని కేటీఆర్ అడగగా…‘తమది ఒక మంచం.. ఒకే కంచం’ అని మామిళ్ల చెప్పారు. ఏది ఏమైనా, ఈటల, జగ్గారెడ్డితో కేటీఆర్ సంభాషణ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈటల మీద బచ్ఛాని పెట్టి గెలిపిస్తా అంటూ మల్లారెడ్డి తాజాగా వ్యాఖ్యానించడం విశేషం.

మరోవైపు, అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీకి తమను ఆహ్వానించలేదని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఏసీ మీటింగ్‌కు పిలిచేవారని, కానీ, సమైక్య పాలకులకు ఉన్న సోయి తెలంగాణ పాలకులకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీజేపీకి ముగ్గురు సభ్యులున్నార బీఏసీ మీటింగ్ కు పిలవకపోవడం ఏమిటని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో చాలా గదులు ఖాళీగా ఉన్నా తమకు ఆఫీసు గది కేటాయించలేదని ఆరోపించారు. ఇది కక్ష సాధింపేనని, దీనిపై స్పీకర్‌‌కు ఫోన్ చేసి అడిగినా సమాధానం లేదని వాపోయారు.