పులివెందులలో చంద్రబాబు సభ..వైసీపీ కార్యకర్తల రచ్చ

సీఎం జగన్ ఇలాకా కడపలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించేందుకు సీమలో పర్యటిస్తున్న చంద్రబాబు…కడప జిల్లా జమ్మలమడుగులో రోడ్ షో నిర్వహించారు. పులివెందులలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబు సభను అడ్డుకునేందుకు కొందరు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు.

సభా ప్రాంగణానికి ఓపెన్ టాప్ వాహనంలో వచ్చి వైసీపీ జెండాలను ప్రదర్శిస్తూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. దీంతో, ఆ వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు వెంబడించారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అంతకుముందు, పులివెందులలో చంద్రబాబుకు బీటెక్ రవి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, చినీ రైతులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. సింహాద్రిపురంలో పులివెందుల టీడీపీ ఇన్ చార్జ్ బీటెక్ రవి ఇంటికి చంద్రబాబు వెళ్లారు.

కడప జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గండికోట సీబీఆర్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం జగన్ పై మండిపడ్డారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని జగన్.. కొత్త ప్రాజెక్టుల పేరుతో 12 వేల కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపారని చంద్రబాబు ఆరోపించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని జగన్…మంత్రి పెద్దిరెడ్డికి మాత్రం రూ.600 కోట్ల బిల్లులు సెటిల్ చేశారని ఆరోపణలు గుప్పించారు. జగన్ పాలనలో మంత్రులే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారని ఆరోపించారు.

టీడీపీ మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తిచేస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశ్యంతో నాలుగేళ్లలో జగన్ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదన్నారు. ఇక, ప్రాజెక్టుల గురించి చర్చ జరుగుతోంటే…నీటిపారుదల శాఖా మంత్రి అంబటి బ్రో సినిమా పంచాయతీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పోలవరం నిర్వాసితులు వరద ముంపునకు గురైతే కనీసం తిండి పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే పోలవరం ముంపు మండలాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించి నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.