బాబు చెప్పినా.. విన‌ని అక్కాత‌మ్ముడు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని గెలిపించ‌డం కోసం అధినేత చంద్ర‌బాబు శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. కానీ నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ‌లో మాత్రం బాబు చెప్పిన మాట‌ల‌ను ఆ అక్కాత‌మ్ముడు ఏ మాత్రం లెక్క‌చేయ‌డం లేద‌ని తెలిసిందే. వాళ్లే మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌, ఆమె త‌మ్ముడు భూమా జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి. రాజ‌కీయంగా త‌మ ఉనికిని కాపాడుకోవ‌డం పార్టీ అధినేత ఆదేశాల‌ను వీళ్లు బేఖాత‌ర్ చేస్తున్నార‌ని తెలిసింది.

నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీలో మూణ్నాలుగా వ‌ర్గాలున్నాయి. అయితే అఖిల ప్రియ మిన‌హా మిగ‌తా నేత‌లంద‌రినీ పిలిచి క‌లిసిక‌ట్టుగా పార్టీ కోసం ప‌ని చేయాల‌ని బాబు చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల పార్టీ ఇంఛార్జీ భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, మాజీ మంత్రి ఫ‌రూక్‌, ఏవీ సుబ్బారెడ్డి త‌దిత‌రుల‌తో క‌లిసి బాబు నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి భూమా అఖిల ప్రియ‌ను కానీ జ‌గ‌త్‌విఖ్యాత్ రెడ్డిని కానీ పిల‌వలేదు. మ‌రోవైపు నంద్యాల టికెట్ ఈ సారి బ్ర‌హ్మానంద‌రెడ్డికే అని చంద్ర‌బాబు సంకేతాలు ఇచ్చిన‌ట్లు తెలిసింది.

నంద్యాల‌లో అఖిల ప్రియ‌కు, జ‌గ‌త్‌విఖ్యాత్‌కు ఏం ప‌ని లేద‌ని, వీళ్ల‌ వెంట ఎవ‌రూ వెళ్లొద్ద‌ని బాబు చెప్పారంటా. కానీ ఆ ఆదేశాల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా జ‌గ‌త్‌విఖ్యాత్ రెడ్డి త‌న వ‌ర్గం నాయ‌కుల‌తో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నంద్యాల నుంచి పోటీ చేస్తాన‌ని ఆయ‌న తేల్చి చెప్పిన‌ట్లు తెలిసింది. ఎమ్మెల్యేగా ఉంటూ తండ్రి భూమా నాగిరెడ్డి ప్రాణాలు వ‌దిలిన నంద్యాల‌ను వ‌దిలేదే లేద‌ని జ‌గ‌త్‌విఖ్యాత్ రెడ్డి స్ప‌ష్టం చేశార‌ని స‌మాచారం. మ‌రోవైపు ఆళ్ల‌గ‌డ్డకు అక్క అఖిల ప్రియ ఇంఛార్జీగా ఉన్నార‌ని, ఆమె అక్క‌డి నుంచి పోటీ చేస్తార‌ని జ‌గ‌త్‌విఖ్యాత్ అంటున్నార‌ని తెలిసింది. బాబు ఎంత చెప్పినా ఈ అక్కా త‌మ్ముడు మాత్రం త‌మ ప‌ని త‌మ‌దే అన్న‌ట్లు సాగుతున్నారనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.