ఈ అసెంబ్లీ సెషన్ లో కేసీఆర్ కి ఇబ్బందులు తప్పవా?

ఆగస్టు 3వ తేదీ నుండి తెలంగాణా అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మొదలవబోతున్నాయి. బహుశా షెడ్యూల్ ఎన్నికల్లోపు జరగబోయే ఆఖరి సమావేశాలు ఇదే అనుకుంటున్నారు. తొందరలో మొదలవ్వబోయేది వర్షాకాల సమావేశాలు. ఎన్ని రోజులు జరుగుతుందనేది సమావేశాలు మొదలైన తర్వాత బీఏసీ సమావేశంలోనే నిర్ణయమవుతుంది. మామూలుగా అయితే నవంబర్, డిసెంబర్లో శీతాకాల సమావేశాలు జరుగుతాయి. కానీ షెడ్యూల్ ఎన్నికల నిర్వహణ కోసం అక్టోబర్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని అనుకుంటున్నారు.

ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరగవు. కాబట్టి ఆగష్టులో జరగబోయేది చివరి సమావేశాలనే ప్రచారం ఊపందుకుంది. అందుకనే అసెంబ్లీ వేదికగా అదికార, ప్రతిపక్షాల మధ్య బిగ్ ఫైట్ తప్పేట్లు లేదనే ప్రచారం మొదలైపోయింది. కేసీఆర్ ప్రభుత్వంపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. దానికి అనుగుణంగానే ప్రతిపక్షాలు అస్త్రాలను రెడీ చేసుకుంటోంది. అధికార పార్టీ దురదృష్టం ఏమిటంటే ప్రస్తుత వర్షాలు, తుపాను ప్రభావమే.

కొద్దిరోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీవర్షాలకు రాష్ట్రంలోని చాలా ఊర్లు ముణిగిపోయాయి. వర్షాలను, తుఫానులను ఎవరు ఆపలేరు. అయితే ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే దాని తీవ్రతను తగ్గించే అవకావముంది. ముందుగానే మేల్కొని జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించచ్చు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఆ పనిచేసినట్లు కనబడటం లేదు. ఎందుకంటే చాలా ఊర్లలోని జనాలు ఇళ్ళమీదకు చేరుకుని సాయం కోసం నానా అవస్తలు పడుతున్న దృశ్యాలు టీవీల్లో కనబడుతున్నాయి. సహాయ పునరావాస శిబిరాలు ఏర్పాటు, బాదితులను సురక్షితంగా శిబిరాలకు చేర్చటంలో ప్రభుత్వం ఫెయిలైందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

ఇది కాకుండా ప్రభుత్వ భూములను యధేచ్చగా అమ్మేయటం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ లో అవకతవకలు, అవినీతి, లా అండ్ ఆర్డర్ వైఫల్యం, ప్రతిపక్షాల నేతలపై కేసులు నమోదుచేసి జైళ్ళల్లోకి తోయటం లాంటి అనేక అంశాలపై చర్చించేందుకు ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయి. సమావేశాలు మొదలవ్వటమే ఆలస్యం యుద్ధానికి రెడీ అయిపోయాయి. ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ సభ్యులు తమ అస్త్రాలను రెడీ చేసుకున్నట్లు ఆయా పార్టీల ప్రకటనలను బట్టి అర్దమవుతోంది. ఎంతైనా చివరి సమావేశలంటున్నారు కదా అందుకనే రెచ్చిపోవటం ఖాయమంటున్నారు.