పవన్ ను లాగిపెట్టి కొట్టాలనుంది: వాసిరెడ్డి పద్మ

ఆంధ్రప్రదేశ్ లో 30 వేల మంది మహిళల మిస్సింగ్ కరెక్టేనంటూ కేంద్ర మంత్రి స్వయంగా చెప్పడంతో ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంతో పాటు ఏపీ మహిళా కమిషన్, ఏపీ డీజీపీ ఇరకాటంలో పడ్డారు. ఆ గణాంకాలపై ఎవరికి వారు వివరణనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కేంద్రం చెప్పిన లెక్కలపై సమాధానమివ్వాలంటూ ఏపీ మహిళా కమిషన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలకు స్పందించిన ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ దత్తపుత్రుడు మాత్రమే కాదని, విష పుత్రుడు కూడా అని పద్మ షాకింగ్ కామెంట్లు చేశారు. మహిళల అదృశ్యంలో దేశంలోనే ఏపీ 11వ స్థానంలో ఉందన్న విషయాన్ని పవన్ ఎందుకు ప్రస్తావించటం లేదని నిలదీశారు. రాజ్యసభలో ఏపీలో మహిళల అదృశ్యం అంశంపై ఎందుకు ఎక్కువ ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించారు. ప్రేమ, ఇతర వ్యక్తిగత వ్యవహారాల వల్లే చాలామంది అమ్మాయిలు, మహిళలు అదృశ్యం అవుతున్నారని పవన్ తెలుసుకోవాలని హితవు పలికారు.

ఈ ప్రేమలకు సినిమాలు ఒక కారణం కాదా అని పవన్ ను ప్రశ్నించారు. మిస్ అయిన వారిలో 70 శాతం వెనక్కి వస్తున్నారని పవన్ గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి అని పవన్ అన్నారని, హీరోలు ఏం చెప్పినా చెల్లుతుందా?? అని ప్రశ్నించారు. భరణం ఇచ్చి వదిలించుకుంటాం అంటే ఆ మహిళకు అన్యాం చేసినట్లు కాదా అని నిలదీశారు. పవన్ ఎదురుపడితే లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తోందని, కానీ, సభ్యత ఉంది కాబట్టే నోటీసులు ఇస్తున్నామని అన్నారు.

అమ్మాయిలు, మహిళల మిస్సింగ్ లో తెలంగాణ రాష్ట్రం ఆరో స్థానంలో ఉందని, మరి, అక్కడ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పరని ప్రశ్నించారు. వాలంటీర్ల వల్లే మహిళలు అదృశ్యం అవుతున్నారన్న పవన్ …వాటికి ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మిస్సింగ్ కేసుల రికవరీలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. అయితే, ఏపీలో మహిళల మిస్సింగ్ కు సినిమాలలో ప్రేమలే కారణమంటూ వాసిరెడ్డి పద్మ చేసిన కామెంట్లపై ట్రోలింగ్ జరుగుతోంది.