జగన్ కు పవన్ ‘పుష్ప విలాపం’

ఏపీలో సీఎం జగన్ పర్యటన అంటే చాలు…ఇటు అధికారులు..అటు పోలీసులు…మరోవైపు సామాన్య ప్రజలు, దుకాణదారులు హడలెత్తుతున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ టూర్ అంటే చాలు…ఆయన వెళ్లే దారిలో చెట్లు నరికివేయడం…పరదాలు కట్టడం…దుకాణాలు మూయడం వంటివి పరిపాటిగా మారాయి. ఇక, జనం మధ్యలో తిరిగే సమయంలో కూడా జగన్ పరదాల మధ్యనే పర్యటిస్తాని విపక్ష నేతలు విమర్శిస్తుంటాయి. ఈ క్రమంలోనే జగన్ కు పరదాల మహారాణి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కొత్త పేరు పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ పై పవన్ మరోసారి విమర్శలు గుప్పించారు. పుష్ప విలాపం నవల నుంచి కొన్ని లైన్లను ప్రస్తావిస్తూ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు పవన్.

ఈ నెల 26 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో జగన్ పర్యటించనున్నారు. దీంతో, సీఎం హెలికాప్టర్ దిగేందుకు ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ దగ్గర ఖాళీ స్థలంలోని కొబ్బరి చెట్లను నరికి హెలీప్యాడ్ రెడీ చేస్తున్నారు. దీంతో, ఈ వ్యవహారంపై పవన్‌ స్పందించారు. వైసీపీ పాలనలో చెట్లు కూడా విలపిస్తున్నాయంటూ సెటైర్ వేశారు. కొట్టేసిన చెట్ల ఫొటోలు ట్వీట్ చేశారు. ఇలా చెట్లను నరకవద్దని ఏపీ సీఎస్‌ అయినా అధికారులకు చెప్పాలని కోరారు.

‘కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలి. వృక్షో రక్షతి రక్షితః’’ అని పవన్ ట్వీట్ చేశారు.

‘జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ‘పుష్ప విలాపం’ చదవనప్పుడు, జగదీష్ చంద్రబోస్ ప్రయోగాలు మీకు అర్థం కానప్పుడు, మొక్కలు,చెట్లకు గాయం చేస్తే ఎలా ఉంటుందో వీటిని చూస్తే తెలుస్తుంది. సీఎం పట్టించుకోకపోయినా కనీసం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా ఇలా విచక్షణారహితంగా చెట్లను నరకవద్దని సంబంధిత అధికారులకు సూచించాలి’ అని ట్వీట్‌ చేశారు. వీటితోపాటు జంధ్యాల పాపయ్య శాస్త్రి ‘పుష్ప విలాపం’ నుంచి పవన్ చేసిన సారాంశం ట్వీట్లు వైరల్ అయ్యాయి.

‘‘ఓయీ మానవుడా
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి
అందమును హత్య చేసెడి హంతకుండా
మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ..
అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని
నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు..
ప్రభూ…’’