జగన్ గారూ.. ఇది చూశారా?

ప్రతిపక్ష నేతల మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శల దాడి తీవ్రమవుతోంది. ఐతే ఆ విమర్శలు రాజకీయంగా ఉంటే బాగుండేది కానీ.. ఆయన వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లిపోతున్నారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తారంటే చాలు.. ఆయన పెళ్లిళ్ల విషయం తప్ప మరోటి మాట్లాడట్లేదు జగన్.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. పబ్లిక్ మీటింగ్‌ల్లో ఆయన అదుపు తప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు. గత నెలలో స్కూల్ పిల్లల ముందు పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడటం జగన్‌కే చెల్లింది. పవన్ అధికారికంగా విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటే జగన్‌కు వచ్చిన బాధేంటన్నది అర్థం కాని విషయం.

పైగా పవన్ చేసుకున్నది మూడు పెళ్లిళ్లు అయితే నాలుగు పెళ్లిళ్లు అంటూ ఎగ్జాజరేట్ చేయడం జగన్‌కే చెల్లింది. తాజాగా వెంకటిగిరిలో జరిగిన మీటింగ్‌లో పవన్ మీద మరింత హద్దులు దాటి మాట్లాడారు జగన్. పనిలో పనిగా నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడల గురించి కూడా వ్యక్తిగతంగా తీవ్ర వ్యాఖ్యలే చేశారు ఏపీ సీఎం.

ఐతే వైసీపీలోని కొందరు నేతల వ్యవహారం చూస్తే వాళ్ల ముందు పవన్, లోకేష్, బాలయ్య, చంద్రబాబుల వ్యక్తిగత విషయాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయనడంలో సందేహం లేదు. ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ లాంటి నేతల ఆడియోలు ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే.

ఇక ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారానికి సంబంధించిన రచ్చ గురించీ చెప్పాల్సిన పని లేదు. జగన్ చెబుతున్నట్లు యూట్యూబ్‌లోకి వెళ్లి వెతికితే వీళ్ల ఆడియోలు, వీడియోలు మరింత ప్రముఖంగా కనిపిస్తాయి. ఇదంతా ఒకెత్తయితే.. తాజాగా అంబటి రాంబాబు ఒక యూట్యూబ్ ఛానెల్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన ఆడియోలకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై షాకింగ్ కామెంట్లు చేశారు.

‘‘నేను సంజనతో మాట్లాడతా.. సుకన్యతో మాట్లాడతా. వాళ్లకు లేని ప్రాబ్లెం మీకెందుకు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ ఆరోపణలుగా ఉన్న విషయాలను రాంబాబు తన వ్యాఖ్యలతో ధ్రువీకరించినట్లు అయింది. మరి రాంబాబు లాజిక్ ప్రకారం పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే ఆయన ఆ మహిళలకు లేని ప్రాబ్లెం వైసీపీ వాళ్లకు, ముఖ్యంగా ఏపీ సీఎంకు ఎందుకు అని జనసేన వాళ్లు అడిగితే ఏం సమాధానం చెబుతారన్నది ప్రశ్న.