అభ్యర్ధుల లిస్టుతో కలకలం

రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్దుల లిస్టు ఇదే అంటు కాంగ్రెస్ పార్టీలో చక్కర్లు కొడుతున్న ఒక జాబితా సంచలనంగా మారింది. మొత్తం 119 నియోజకవర్గాల ప్రాబబల్స్ అన్న పేరుతో జాబితా ఫుల్లుగా సర్క్యులేషన్లో ఉంది. చాలామంది సీనియర్ నేతల మొబైల్ ఫోన్ల వాట్సప్ లో ఈ జాబితా చక్కర్లు కొడుతోందట. దీంతో కొంతమంది నేతలకు ఖుషీగాను, కొందరిలో మంటగాను మరికొందరు నేతల్లో టెన్షన్ పెంచేస్తోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ జాబితా వ్యూహకర్త సునీల్ కనుగోలు పేరుతో ఉంది. ఈ జాబితాను సునీల్ కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లుగా ఉంది. వాస్తవానికి ఇపుడు సునీల్ తెలంగాణలో లేరట. కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వానికి సలహదారుగా ఈమధ్యనే వెళ్ళారట. మరైతే ఈ జాబితా ఇపుడే ఎందుకుని సర్క్యులేషన్లోకి వచ్చిందనే విషయం అర్ధంకావటం లేదు. నిజంగానే ఈ జాబితాను సునీల్ కాంగ్రెస్ అధిష్టానికి పంపారా లేకపోతే సునీల్ పేరు మీద ఇంకెవరైనా తయారుచేసి ప్రచారంలోకి పెట్టారా అన్నది తెలీటం లేదు.

ఈ జాబితా ప్రకారం 68 నియోజకవర్గాల్లో అభ్యర్ధులుగా సింగిల్ పేర్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 51 నియోజకవర్గాలకు మాత్రం రెండు, మూడు పేర్లతో ప్రాబబల్సు అనే పేరుతో జాబితా ఉంది. మొత్తంమీద ఇపుడీ జాబితా ఎందుకు సంచలనమైందంటే లిస్టులో ఉన్న పేర్లలో ఎక్కువగా వలస పార్టీల నేతల పేర్లే ఎక్కువగా కనబడున్నాయట. మొదటినుండి పార్టీలోనే ఉంటు కష్టపడిన నేతల పేర్లు కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లోని నేతల పేర్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

ఇంకా బీఆర్ఎస్, బీజేపీల్లోనే కంటిన్యూ అవుతున్న కొందరు నేతల పేర్లు కూడా ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న జాబితాలో ఉన్నాయట. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలు, ఆశావాహుల్లో టెన్షన్ పెరిగిపోతోందట. తమ పేర్లు లేకపోవటంతో చాలామంది నేతలు గాంధీభవన్ కు రావటమ లేకపోతే సీనియర్లను ఫోన్లలో సంప్రదిస్తున్నారు. దాంతో ఈ నేతలకు ఏమని సమాధానం చెప్పాలో తెలీక చాలామంది తలలు పట్టుకుంటున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఇక్కడ తేలేది కాదు ఏకంగా ఢిల్లీకి వెళ్ళి లిస్టు సంగతేమిటో తెలుసుకుందామని మరి కొందరు సీనియర్లు రెడీ అవుతున్నారట. మొత్తానికి ప్రాబబుల్స్ పేరుతో చక్కర్లు కొడుతున్న జాబితా సంచలనంగా మారింది.