అవినాష్ రెడ్డిని బుక్ చేసిన షర్మిల?

సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ సినిమా థ్రిల్లర్ ను తలపించేలా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లయినా ఈ కేసులో నిందితులకు శిక్ష పడకుండా విచారణ నత్తనడకన సాగుతున్న వైనంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది అక్టోబర్ 7న సీబీఐకి షర్మిల ఇచ్చిన వాంగ్మూలాన్ని తాజాగా కోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు. రాజకీయ కారణంతోనే వివేకా మర్డర్ జరిగిందని….కుటుంబ, ఆర్థిక కారణాల వల్ల కాదని షర్మిల చెప్పారు.

అవినాష్ రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే ఈ హత్యకు కారణం కావచ్చని షర్మిల వాంగ్మూలంలో చెప్పారు. కడప ఎంపీగా తనను పోటీ చేయాలని బాబాయ్ కోరారని, ఆయన పదేపదే అడగడంతో ఒప్పుకున్నానని షర్మిల చెప్పారు. అయితే, ఎమ్మెల్సీగా ఓడిపోయిన బాబాయ్ ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదని అన్నారు. అమ్మ విజయమ్మపై వివేకా పోటీ చేసిన తర్వాత జగన్ ఆయనకు టికెట్ ఇవ్వడని ఫిక్స్ అయ్యారని షర్మిల చెప్పారు. ఎమ్మెల్సీగా వివేక ఓటమికి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కొందరు సన్నిహితులు కారణమై ఉండవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు, కోర్టుకు దాఖలు చేసిన చార్జిషీట్లో సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. వివేకా హత్యకు ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కుట్ర చేశారని సీబీఐ వెల్లడించింది. ఈ హత్య కేసులో కుట్ర, హత్య సాక్షాలు చెరిపివేతను కోర్టుకు వివరించింది. గూగుల్ టేక్ అవుట్, ఫోన్ లొకేషన్ డేటాను కోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు. వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలున్నాయని, కానీ తగిన ఆధారాలు లభించలేదని అధికారులు చెప్పారు. సాక్షాల చెరిపివేత సమయంలో మనోహర్ రెడ్డి అక్కడే ఉన్నా ఆయన ప్రమేయం నిర్ధారణ కాలేదని వెల్లడించింది. వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష నివేదికతోపాటు కొన్ని ఫోరెన్సిక్ రిపోర్టులు చెన్నై నుంచి రావాల్సి ఉందని వెల్లడించింది.