ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఎలా తుడ‌వాలో ఆ డాక్ట‌ర్ చెప్పారు: సీబీఐ

“ఔను.. వారిదే సూత్రం.. వారిదే పాత్ర‌.. ఈ విష‌యంలో తేడాలేదు” అని ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి తాజాగా సీబీఐ స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. ఆ వారే.. సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే త‌న తమ్ముడు అని సంబోధించే క‌డ‌ప‌ ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి వైఎస్ భాస్క‌ర‌రెడ్డి. వీరిద్ద‌రేఅస‌లు సూత్ర‌ధారులు, పాత్ర ధారులు అని సీబీఐ మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు పిటిష‌న్‌కే పరిమిత‌మైన ఈ విష‌యం.. కోర్టు కీల‌కంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే చార్జిషీటులో నూ వారిపైనే అభియోగాలు న‌మోదు చేయ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఈ చార్జిషీటును తాజాగా సీబీఐ కోర్టుకు ఆ సంస్థ త‌ర‌ఫు న్యాయ‌వాదులు స‌మ‌ర్పించారు. ఈ చార్జిషీట్‌లో మ‌రిన్ని కీలక విషయాలు కూడా వెల్లడించారు. హ‌త్య‌కు సంబంధించిన‌ కుట్ర, ర‌క్త‌పు మ‌ర‌క‌ల సాక్ష్యాలు చెరిపేలా చేయ‌డం, హ‌త్య జ‌రిగిన త‌ర్వాత‌.. దానిని గుండెపోటుగా అభివ‌ర్ణించ‌డం.. ఇత‌ర సాక్ష్యాల‌ను కూడా ప్ర‌భావితం చేయ‌డం వంటివాటిని కూడా సీబీఐ పేర్కొంది.

ఈ దారుణ‌ హత్య కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ త‌న చార్జి షీటులో పేర్కొంది. దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి కృష్ణారెడ్డిపైనా సీబీఐ అనుమానాలు వ్య‌క్తం చేసింది. అయితే.. ఆయ‌న‌కు సంబంధించి ఇంకా ఆధారాలు ల‌భించాల్సి ఉంద‌ని తెలిపింది. ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను ఎలా చెరిపేయాలో.. ఏయే ర‌సాయ‌నాలు వాడాలో డాక్ట‌ర్ వైఎస్ మనోహర్ రెడ్డి ఆ స‌మయంలో వివ‌రించార‌ని.. అయితే.. దీనికి సంబంధించి కూడా సాక్ష్యాల‌ను సేక‌రించాల్సి ఉంద‌ని తెలిపింది.

హ‌త్య జ‌రిగిన ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టయిన వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపింది. వైఫై రూటర్ల వివరాల కోసం అమెరికా అధికారులకు కోరిన‌ట్టు సీబీఐ ఇచ్చిన చార్జిషీట్‌లో స్ప‌ష్టం చేసింది. అదేవిధంగా హ‌త్య‌కు కొన్ని నిముషాల ముందు రాసిన లేఖ‌ను నిన్ హైడ్రిన్ పరీక్షకు పంపించామ‌ని.. అదేవిధంగా మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ ప‌రీక్ష‌ల‌కు పంపించామ‌ని.. ఆయా నివేదికలు ఇంకా రాలేద‌ని తెలిపింది.