2024లో I-N-D-I-A వర్సెస్ N.D.A

రాబోయే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఓటమే లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ బెంగుళూరులో రెండు రోజుల పాటు సమావేశమైన సంగతి తెలిసిందే. జాతీయ పార్టీ కాంగ్రెస్ తో పాటు టీఎంసీ, ఆప్ వంటి పలు ప్రాంతీయ పార్టీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా విపక్ష ఫ్రంట్‌కు I-N-D-I-A (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్) అని పేరు పెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎన్డీఏ సర్కార్ పై కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే వర్సెస్ ‘ఇండియా’ (I-N-D-I-A)గా పోరు ఉంటుందని ప్రకటించారు. బీజేపీ, ప్రతిపక్షాల మధ్య యుద్ధం కాదని, ప్రజలకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కల్పించేందుకు చేస్తోన్న యుద్ధమని చెప్పారు. ముంబై సమావేశం సందర్భంగా తమ యాక్షన్ ప్లాన్ వెల్లడిస్తామని అన్నారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందన్నారు.

రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే, I-N-D-I-A మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. I-N-D-I-Aను ఎన్డీయే ఛాలెంజ్ చేస్తుందా? అని ప్రశ్నించారు. 2024లో I-N-D-I-A గెలుస్తుందని, ఎన్టీఏ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. విపక్ష నేతల పైకి బీజేపీ సీబీఐ, ఈడీని ప్రయోగిస్తోందని ఆరోపించారు. తొమ్మిదేళ్లలో బీజేపీ ప్రతి వ్యవస్థను నాశనం చేసిందని, రైల్వే వ్యవస్థను కూడా నాశనం చేశారని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు.

విపక్షాల భేటీకి 26 పార్టీల నేతలు హాజరయ్యారని, వారందరికీ కృతజ్ఞతలు అని ఖర్గే తెలిపారు. అంతేకాదు, తమ తదుపరి సమావేశం ముంబైలో ఉంటుందని వెల్లడించారు. పాట్నాలో తొలి సమావేశానికి 16 పార్టీలున్నాయని, బెంగళూరులో భేటీకి కూటమిలో మొత్తం 26 పార్టీలున్నాయని చెప్పారు. దేశ, ప్రజా ప్రయోజనాల పరిరక్షణకే I.N.D.I.A కూటమి ఏర్పడిందని ఖర్గే తెలిపారు. విపక్ష నేతలందరూ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇచ్చారన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కూటమిలోని పార్టీల మధ్య అభిప్రాయభేదాలున్నాయని, వాటిని పరిష్కరించుకుంటామని, 11మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్డీయే సమావేశానికి 38 పార్టీలు వచ్చాయని చెబుతున్నారని, పేరు, గుర్తు లేని పార్టీలతో ఎన్డీయే సమావేశం జరిగిందని ఎద్దేవా చేశారు.