సీఎం ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం

తెలుగుదేశం యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన సమయంలో ఒంగోలు టౌన్లో వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తర్వాతి సీఎం ఎన్టీఆరే అంటూ ఏర్పాటైన ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫ్లెక్సీల్లో.. “నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్. అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే” అని రాసి ఉంది.

సరిగ్గా లోకేష్ యాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన సమయంలోనే జిల్లా కేంద్రం ఒంగోలులో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్‌కు దక్కుతున్న ప్రాధాన్యాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక వర్గం వ్యతిరేకిస్తుండటం కొత్త విషయం కాదు. తెలుగుదేశం పార్టీకి అసలైన వారసుడు తారకే అని.. అతనే భవిష్యత్తులో పార్టీ పగ్గాలు చేపడతాడని, సీఎం కూడా అవుతాడని ఈ వర్గం బలంగా నమ్ముతుంటుంది.

సోషల్ మీడియాలో కూడా తరచుగా తెలుగుదేశంలో నారా లోకేష్ అభిమానులకు.. తారక్ ఫ్యాన్స్‌కు మధ్య వాదోపవాదాలు నడుస్తుంటాయి. ఈ నేపథ్యంలో తారక్ అభిమానులే ఈ ఫ్లెక్సీలు పెట్టినట్లు ఎవ్వరైనా భావిస్తారు. కానీ దీని వెనుక కుట్ర కోణం ఉన్నట్లుగా తెలుగుదేశం వర్గాలు అనుమానిస్తున్నాయి. తారక్‌ అభిమానులను వైసీపీ రెచ్చగొట్టడం కొత్తేమీ కాదని.. నారా లోకేష్ మీదికి వాళ్లను ఎప్పట్నుంచో ఉసిగొలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. లోకేష్ యాత్ర ప్రకాశం జిల్లాలోకి వస్తున్న సమయంలో అతడికి ఇబ్బంది కలిగించేలా.. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా గొడవలు జరిగేలా ఇది వైసీపీ చేసిన కుట్రే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు అవసరమైన ఫ్రేమ్‌లను అఫ్రిది అనే వాలంటీర్ ఇచ్చినట్లు వెల్లడైంది. అతడి దగ్గరికి టీడీపీ నేతలు వెళ్లగా.. తనకు రఘు అనే వ్యక్తి చెబితేనే ఫ్రేమ్‌లు ఇచ్చానని.. అతనెవరో తనకు తెలియదని అంటున్నాడు. మీడియా సైతం దీని మీద పరిశోధించే ప్రయత్నం చేస్తుండగా.. వైసీపీ వాళ్లే కుట్రపూరితంగా ఇది చేయించారని.. ఇందులో తారక్ అభిమానుల పాత్రేమీ లేదనే విధంగా సమాచారం బయటికి వస్తుండటం గమనార్హం.