విభ‌జ‌న చ‌ట్టానికి ముగింపు కాలం.. వైసీపీ కోర్టులో కీల‌క బాల్‌!

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను విభ‌జిస్తూ.. 2014లో కాంగ్రెస్ చేసిన విభ‌జ‌న చ‌ట్టానికి కాలం ముగిసిపోతోంది. మొత్తం 10 సంవ‌త్స‌రాల పాటు అమ‌ల్లో ఉండేలా.. ఈ విభ‌జ‌న చ‌ట్టాన్ని అప్ప‌ట్లో రూపొందించారు. ఈ క్ర‌మంలో ఈ చ‌ట్టంలోని అంశాల‌ను ప‌దేళ్ల కాలంలో నెర‌వేర్చాల‌ని నిర్ధిష్టంగా పేర్కొన‌క‌పోయినా.. చ‌ట్టం గ‌డువును అనుస‌రించి ప‌దేళ్ల కాలంలో ఆయా అంశాల‌ను ఏపీకి.. అదేవిధంగా తెలంగాణ‌కు నెర‌వేర్చాల్సి ఉంది.

కానీ, తెలంగాణ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఏపీ అంశం ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న మెజారిటీ అంశాల‌ను ఇప్ప‌టికీ మోడీ స‌ర్కారు నెర‌వేర్చ‌లేద‌ని అటు మేధావులు, ఇటు రాజ‌కీయ ప‌రిశీల‌కులు కూడా చెబుతున్నారు. క‌డ‌ప ఉక్కుఫ్యాక్ట‌రీ నుంచి లోటు బ‌డ్జెట్ నిధుల వ‌ర‌కు.. పోల‌వ‌రం ముంపు ప్రాంతాల నుంచి విశాఖ మెట్రో వ‌ర‌కు.. విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ‌లోని ఆస్తుల‌ను పంచాల్సి ఉంది.

ఇక‌, రాజ‌ధాని విష‌యం మ‌రింత కీల‌కం. ఈ చ‌ట్టం ప్ర‌కారం.. ప‌దేళ్ల వ‌ర‌కు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని గా ఉంది. కానీ, ఎవ‌రికివారుగా ఉన్న‌ప్ప‌టికీ.. చ‌ట్టం ప్ర‌కారం అయితే.. ఇప్ప‌టికీ ఉమ్మ‌డిగా హైద‌రాబాద్ ను రాజ‌ధానిగా వాడుకునే వెసులుబాటు ఉంది. ఇక‌, ఈ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాలు నెర‌వేర్చారా.. లేదా.. అనే విష‌యంతో సంబంధం లేకుండా.. కాలం అయితే ప‌రుగులు పెట్టేసింది.

వ‌చ్చే ఏడాది మే నాటికి ఈ విభ‌జ‌న చ‌ట్టం ప‌దేళ్లు పూర్తి చేసుకుని.. కాల‌తీతంగా మారిపోతుంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఇప్ప‌టికిప్పుడు ఈ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ప్ర‌తి అంశాన్నీ సాధించాల్సి ఉంటుంది. ఒక‌వేళ సాధించ‌లేని.. సాధ్యం కాని ద‌శ‌లో .. ఈ చ‌ట్టం కాల ప‌రిమితిని మ‌రో ఐదేళ్ల‌పాటు పెంచేలా అయినా.. పార్ల‌మెంటులో పోరాటం చేయాల్సి ఉంటుంది. ఒక‌సారి కాలం తీరిపోయిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ పెంచేందుకు పార్ల‌మెంటులో పెద్ద త‌తంగ‌మే చేయాల్సి ఉంటుంది. సో.. ఇప్పుడు విభ‌జ‌న చ‌ట్టం తాలూకు.. ప‌రిణామాల్లో మంచి జ‌ర‌గాలంటే.. వైసీపీ పూనిక వ‌హించ‌క‌త‌ప్ప‌ద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.