రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూ దొరికి పోయాడు

లంచం తీసుకుంటూ అధికారులు ఏసీబీకీ దొరికిపోవటం చాలా కామన్. అయితే.. సదరు అధికారి స్థాయికి.. తీసుకునే లంచానికి పెద్ద పోలిక లేని రీతిలో చాలా సందర్భాల్లో దొరికిపోతుంటారు. రూ.10 వేలు మొదలు రూ.10 లక్షల లోపు లంచం తీసుకుంటూ దొరికే అధికారులు కోకొల్లలు.

అందుకు భిన్నంగా ‘రియల్’ తిమింగళ అధికారులు ఎలా ఉంటారన్న వాస్తవానికి దగ్గరగా ఉండే భారీ అనకొండ ఒకటి తాజాగా ఏసీబీ అధికారులకు దొరికిన వైనం షాకింగ్ గా మారింది. ఎందుకంటే.. సదరు అధికారి డిమాండ్ చేసిన లంచం రూ.2కోట్లు అయితే.. ఒప్పందంలో భాగంగా తొలి విడతలో రూ.1.10కోట్ల మొత్తాన్ని లంచంగా తీసుకునే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తీరు సంచలనంగా మారింది.

మేడ్చల్ జిల్లా కీసర ఎమ్మార్వోగా వ్యవహరిస్తున్న నాగరాజు శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. భూ రికార్డుల్లో పేర్లు మార్చటం.. లంచం తీసుకొని వారికి అనుకూలంగా పట్టాదారు పాస్ బుక్ ఇవ్వటం కోసం ఇంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామానికి చెందిన 53 ఎకరాల స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కోర్టు నడుస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఒక వర్గానికి అనుకూలంగా రికార్డుల్ని తయారు చేయటానికి వీలుగా ఈ భారీ మొత్తాన్ని లంచంగా కోరినట్లు తెలుస్తోంది. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా రూ.1.10 కోట్ల మొత్తాన్ని ఏఎస్ రావు నగర్ లోని తన నివాసంలో తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆయనతో పాటు.. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మామూలు వ్యక్తులు కాగా.. మూడో వ్యక్తి మాత్రం రాంపల్లి వీఆర్ఏ సాయిరాజ్ కూడా ఉన్నారు.

ఇంత భారీ మొత్తంలో ఒక రెవెన్యూ అధికారి లంచం రూపంలో తీసుకుంటూ దొరికిపోయిన వైనం పెను సంచలనంగా మారింది. గడిచిన కొంతకాలంగా రెవెన్యూ అధికారులు.. వ్యవస్థపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహంగా ఉండటం తెలిసిందే. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే.. రెవెన్యూ అధికారుల వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ.. ప్రస్తుతానికి తన ఆలోచనల్ని పట్టి ఉంచారు.

తాజా ఎపిసోడ్ నేపథ్యంలో తన కీలక నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. కీసర ఎమ్మార్వో పై ఏసీబీ దాడుల ఉదంతం గురించి ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. కీసర రెవెన్యూ అధికారి పుణ్యమా అని.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు.