కేసీయార్ నో చెప్పేశారా ?

రాబోయే ఎన్నికల్లో కొంతమంది ప్రజా ప్రతినిధులు పోటీ చేయడానికి కేసీయార్ నో చెప్పేశారట. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని కొంతమంది ఎంఎల్సీలు రెడీ అయిపోయారు. తమ నియోజకవర్గాల్లో తమకు గెలిచే అవకాశాలున్నాయి కాబట్టి టికెట్లు ఇవ్వాలని కొందరు కోరితే మరికొందరు బాగా ఒత్తిడి పెట్టారట. అయితే ఎంఎల్సీల్లో ఎవరికీ టికెట్లు ఇచ్చేది లేదని కేసీయార్ కచ్చితంగా చెప్పేశారని పార్టీ వర్గాల టాక్. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎవరికి టికెట్లిచ్చినా వాళ్ళ గెలుపుకు సహకరించాల్సిందే అని గట్టిగా చెప్పారట.

శాసనమండలికి పెద్దల సభ అని పేరు. ఎంఎల్ఏల కన్నా కొన్ని ప్రివిలేజెస్ ఎంఎల్సీలకు ఉంటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే అందరి దృష్ఠి అసెంబ్లీ మీదే ఉంటుంది. ఓడిపోయినా పర్వాలేదు కానీ అసెంబ్లీకి పోటీ చేయాల్సిందే అన్నట్లుగా నేతలు వ్యవహరిస్తుంటారు. అసెంబ్లీకి టికెట్ దొరక్కపోతే మాత్రమే నేతల కన్ను మండలిపైన పడుతుంది. అంటే చాలామంది నేతల మనస్తత్వం ఎలాగుంటందంటే అసెంబ్లీకి పోటీచేయాలంటే టికెట్ తమకే ఇవ్వాలి. ఇక్కడ కుదరకపోతే ఎంఎల్సీ ఛాన్సూ తమకే దక్కాలి.

ఇలాంటి నేతల దృష్టిలో తాము తప్ప పార్టీలో ఇంకెవరు నేతలు కారు. ఇపుడు విషయం ఏమిటంటే 13 మంది ఎంఎల్సీలు రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయడానికి రెడీ అయిపోయారట. తమకు టికెట్లు ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబట్టారట. అయితే కేసీయార్ మాత్రం నో చెప్పారని పార్టీవర్గాల టాక్. ఎంఎల్సీలు పాడి కౌశిక్ రెడ్డి, పోచారం శ్రీనివాసులరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కడియం శ్రీహరి అసెంబ్లీకి పోటీచేయాలని అనుకుంటున్నారట.

అలాగే కోటిరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శంభీపూర్ రాజా, తాతామధు, పల్లా రాజేశ్వరరెడ్డి, కూచుకుళ్ళ దామోధరరెడ్డి, సరిరెడ్డి నారాయణరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీకి పోటీచేయాలని చాలా ప్రయత్నాలు చేసుకున్నారట. అయితే వీళ్ళ ప్రయత్నాలు ఫలించేట్లు లేదని సమాచారం. వీళ్ళల్లో చాలామందికి శాసనమండలి అంటేనే చాలా చిన్నచూపుంది. అయితే ఏ కారణాల వల్ల అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోతే వెంటనే శాసనమండలి అవకాశం తమకే దక్కాలని కోరుకుంటారు. ఇది గమనించే కేసీయార్ ఇపుడు అందరికీ నో చెప్పారట. మరి చివరకు ఏమిచేస్తారో చూడాలి.