‘ఓటర్ల జాబితాలో వాలంటీర్ల జోక్యం వద్దు’

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే, అసలు ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదని, పంచాయతీ వ్యవస్థ ఉండగా వాలంటీర్లతో ఏం పని అని పవన్ ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి వాలంటీర్లు సేకరించిన సున్నితమైన సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరుతుందని, ఈ డేటా అంతా హైదరాబాదులోని నానక్ రామ్ గూడలో ఉన్నాయని షాకింగ్ ఆరోపణలు చేశారు. 5 వేలిచ్చి వాలంటీర్లను ఇళ్లలోకి దూరనిచ్చారని ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా వాలంటీర్లపై కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఓటర్ల జాబితా కూర్పులో వాలంటీర్ల జోక్యం లేకుండా జనసైనికులకు చూసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జనసైనికులకు లేఖ పేరుతో ఆయన రాసిన లేఖ సంచలనం రేపుతోంది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను ఉపయోగించకూడదని ఎన్నికల అధికారి చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలోనే జూలై 21 నుండి అర్హులైన కొత్త ఓటర్లను ఓటర్లు జాబితాలో చేర్చుకోవడం, తొలగింపు ప్రారంభమైందని ఆ ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకుండా జనసేన కార్యకర్తలు పర్యవేక్షించాలని ఆయన పిలుపునిచ్చారు

ఈ ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొంటే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని, ప్రతిపక్షాలకు అనుకూల ఓట్లను తొలగించే ఛాన్స్ ఉందని ఆయన చెప్పారు. రావణ రాజ్యం పోవాలన్న రామరాజ్యం రావాలన్న జగన్ పోవాలని పవన్ రావాలని పిలుపునిచ్చారు. గతంలో కూడా పవన్ పై ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను హరి రామ జోగయ్య ఖండించిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై వైసీపీ నేతల స్పందన ఏవిధంగా ఉంటుందనన్నది ఆసక్తికరంగా మారింది.