సోనియానే ఎట్రాక్షనా ?

ఈనెల 17,18 తేదీల్లో బెంగళూరులో జరగబోయే ప్రతిపక్షాల సమావేశంలో సోనియాగాంధీయే ఎట్రాక్షన్ గా నిలవబోతున్నారు. చాలాకాలంగా సోనియా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలుసు. ఆనారోగ్య కారణాలతోనే పార్టీలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండటంలేదు. అందుకనే జాతీయ అధ్యక్ష బాధ్యతలను కూడా వదిలేసుకున్నారు. సీనియర్లలో కూడా చాలామందితో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారట. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం అప్పుడప్పుడు కలిసి మాట్లాడుతున్నారంతే.

ఈ నేపధ్యంలోనే విపక్షాల మీటింగులో సోనియాగాంధీ కూడా పాల్గొంటున్నారని కాంగ్రెస్ ప్రకటించటం ఆశ్చర్యం కలిగించింది. 17వ తేదీ ఉదయం నుండి సాయంత్రం మీటింగు జరుగుతుంది. అనేక అంశాలపై ప్రతిపక్షాల పార్టీల అధినేతలు చర్చించుకుంటారు. ఆరోజు రాత్రికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విందు ఏర్పాటుచేశారు. ఆ విందులో సోనియా కూడా పాల్గొంటారని పార్టీ ప్రకటించింది. మరి అంతకుముందు జరిగే సమావేశంలో పాల్గొనేది లేనిది మాత్రం తెలీదు.

ఏదేమైనా బెంగుళూరులో జరగబోయే మీటింగుకు కాంగ్రెస్ పార్టీయే అధ్యక్షత వహించబోతోంది. పోయిన నెలలో బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన సమావేశానికి 17 పార్టీలు హాజరయ్యాయి. బెంగుళూరు సమావేశంలో 24 పార్టీలు పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొంటారని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రత్యేకంగా కేజ్రీవాల్ గురించే ఎందుకు చెప్పిందంటే పాట్నా సమావేశంలో పాల్గొన్నప్పటికీ చివరలో అలిగి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. అదీకాకుండా కేంద్రప్రభుత్వం తీసుకురాబోతున్న కామన్ సివిల్ కోడ్ బిల్లుకు కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు.

కేజ్రీవాల్ మద్దతు కారణంగా విపక్షాల సమావేశంలో పాల్గొంటారా లేదా అనే అనుమానం కేజ్రీవాల్ పై పెరిగిపోయింది. పార్టీల మధ్య ఉన్న చిన్న చిన్న సర్దుబాట్లను సోనియానే పరిష్కరించబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. వివిధ రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్ విషయంలోనే వివిధ పార్టీల మధ్య వివాదాలు ఏర్పడే అవకాలున్నాయి. అందుకనే త్యాగాలకు సిద్ధమైతే కానీ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావని సోనియా కూడా అనుకుంటున్నారు. మరి సీట్లను త్యాగం చేయటానికి సోనియా ఎంత సుముఖంగా ఉంటారన్న విషయమై కొంత క్లారిటి వచ్చే అవకాశముంది.