పవన్ ను ఓడించింది టీడీపీనే:పోసాని

Posani

ఏపీలో వాలంటీర్ల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలకు సంబంధించిన సున్నితమైన అంశాలను సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు చేరవేస్తున్నారని పవన్ చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. అసలు వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదని, దాన్ని రద్దు చేయాని అన్న రీతిలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. వాలంటీర్లతో పాటు వైసీపీ నేతలు కూడా పవన్ పై విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలోనే. పవన్ పై పోసాని కృష్ణ మురళి సంచలన విమర్శలు చేశారు.

పవన్ చేసిన ఉమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలకు ఆధారాలు చూపాలని, 10 మంది బాధితుల పేర్లు చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పినట్లు పవన్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో, తమ ఇంట్లో ఆడవాళ్ళని లోకేష్ తిట్టించారని పవన్ బాధపడ్డారని, తన మాతృమూర్తి ఏడ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని పవన్ మరిచినట్టు ఉన్నారని పోసాని అన్నారు. అదే సమయంలో వాలంటీర్ల పై పవన్ చేసిన వ్యాఖ్యలు విని ఆ మాతృమూర్తులు బాధపడరా అని నిలదీశారు.

పవన్ పై తనకు ద్వేషం లేదని, ఇంకా గౌరవమే ఉందని పోసాని అన్నారు. జగన్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని పవన్ ఆలోచిస్తున్నారని, కానీ, ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారని చెప్పారు. ప్రజాభిమానం ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పారు. భీమవరంలో పవన్ ఓటమికి టీడీపీనే కారణమని పోసాని షాకింగ్ కామెంట్స్ చేశారు. 15 కోట్లు ఖర్చుపెట్టి మరీ పవన్కు ఓటేయ్యొద్దని టీడీపీ ప్రచారం చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలంటే ఈ విషయంపై విచారణ చేసుకోవచ్చని సవాల్ విసిరారు.

పవన్ నమ్ముకున్న నేతలు ఎన్నటికీ ఆయనను సీఎం చేయరని చెప్పారు. పొరపాటున పవన్ సీఎం అయితే ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి తిడతారని అన్నారు. వాలంటీర్లపై పవన్ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, ఆయన రాజకీయ జీవితానికి ఇది మంచిది కాదని పోసాని హితవు పలికారు. పొరపాటు చేయడం సహజమని, కానీ దాన్ని గుర్తించి క్షమాపణ చెప్పడం హుందాతనమని అన్నారు.